Business Opportunities : 5 ప్రభుత్వ పథకాలతో మహిళలకు వ్యాపార అవకాశాలు
ప్రపంచంలో రెండవ అతిపెద్ద వినియోగదారు మార్కెట్ భారతదేశమే.. అందులో ఎటువంటి సందేహం లేదు.. ఆహారం, అందం, ప్రయాణం, ఆటోమొబైల్, వినోదం మరియు ఆవిష్కరణ వంటి రంగాలలో గత దశాబ్దంలో మిలియన్ల కొద్ది వ్యాపార విజయ కథలు ఉన్నాయి
Business Opportunities : ప్రపంచంలో రెండవ అతిపెద్ద వినియోగదారు మార్కెట్ భారతదేశమే.. అందులో ఎటువంటి సందేహం లేదు.. ఆహారం, అందం, ప్రయాణం, ఆటోమొబైల్, వినోదం మరియు ఆవిష్కరణ వంటి రంగాలలో గత దశాబ్దంలో మిలియన్ల కొద్ది వ్యాపార విజయ కథలు ఉన్నాయి, కాని ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, భారతదేశంలో మహిళల వ్యాపార భాగస్వామ్యం కేవలం 8% మాత్రమే ఉందని తేలింది. సాధారణంగా వ్యాపారాలు చేయడానికి బ్యాంకులు ఎక్కువగా పురుషులనే ప్రోత్సాహిస్తూ ఉంటాయి… అందువల్ల మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఐదు పథకాలతో మహిళలకు వ్యాపార అవకాశాలు మెండుగా ఉన్నాయి..
వాటిలో.. మొదటిది అన్నపూర్ణ యోజన.. ఈ పథకం కింద భారత ప్రభుత్వం ఫుడ్ వ్యాపారం కోసం మహిళా పారిశ్రామికవేత్తలకు 50 వేల రూపాయల వరకు రుణాలు ఇస్తుంది. ఈ మొత్తాన్ని పాత్రలు కొనడానికి, గ్యాస్ కనెక్షన్లు తీసుకోవటానికి, ఫ్రిజ్, మిక్సర్, టిఫిన్ బాక్స్ మరియు డైనింగ్ టేబుల్ వంటి వస్తువుల కొనుగోలుకు ఉపయోగించవచ్చు. ఈ రుణం కోసం గ్యారెంటీ అవసరం ఉంటుంది. ఈ రుణాన్ని 36 నెలల్లో తిరిగి చెల్లించాలి. అన్నపూర్ణ పథకం కింద తీసుకున్న రుణంపై వడ్డీ రేటు మార్కెట్ ప్రకారం నిర్ణయించబడుతుంది. ప్రస్తుతం, ఈ పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి పొందవచ్చు.
రెండవది స్ట్రీ శక్తి ప్యాకేజీ.. ఈ పథకం వ్యాపారంలో 50 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్న మహిళల కోసం ఏర్పాటు చేసింది. వారు చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి ప్యాకేజీ ద్వారా 50 వేల నుండి 2 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తారు. అయితే ఎంఎస్ఎంఇలో నమోదు చేసుకున్న కంపెనీలకు 50 వేల నుంచి 25 లక్షల రూపాయల వరకు రుణాలు పొందే అవకాశం ఉంది. 5 లక్షల రూపాయల వరకు ఎలాంటి భద్రత కల్పించాల్సిన అవసరం లేదు.. స్ట్రీ శక్తి ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవటానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించాలి.
మూడవ పథకం అందరికి తెలిసిందే.. ముద్ర యోజన : చిన్న చిన్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రధాన్ మంత్రి ముద్ర యోజనను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఏ జాతీయ బ్యాంకు నుంచైనా 50 వేల నుంచి 50 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకోవచ్చు. ఈ నిధుల సహాయంతో మహిళలు బ్యూటీ పార్లర్లు, ట్యూషన్ సెంటర్లు, టైలరింగ్ మొదలైన వాటిలో వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఇందులో 10 లక్షల వరకు రుణాలకు గ్యారెంటీ అవసరం అవుతుంది.
నాల్గవ పథకం ఉమెన్ ఎంటర్ప్రైజ్ ఫండ్: మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ , స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్నాయి. దీన్ని 10 సంవత్సరాల వ్యవధిలో చెల్లించవచ్చు. ఇందుకోసం వడ్డీ రేట్లు మార్కెట్ ఆధారంగా నిర్ణయించబడతాయి. ఈ పథకం కింద, బ్యూటీ పార్లర్లను తెరవడం, డే కేర్ సెంటర్లను నడపడం, ఆటో రిక్షాలు కొనడం, బైక్లు, కార్లు కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఈ పథకం సహాయంతో, ఇప్పటికే కొనసాగుతున్న వ్యాపారాలను కూడా విస్తరించుకోవచ్చు.
ఫైనల్ గా ఐదవ పథకం.. మహిలా సమృద్ధి యోజన: ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన మహిళలను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. వ్యాపారం ప్రారంభించడానికి అయ్యే ఖర్చుల కోసం బ్యాంక్ 60 వేల రూపాయల వరకు రుణం ఇస్తుంది. దీనిని 3 సంవత్సరాల 6 నెలల్లో చెల్లించాలి. ఇందుకోసం ఏటా 4% వడ్డీ మాత్రమే చెల్లించాలి. దారిద్య్రరేఖ (బిపిఎల్) క్రింద నివసిస్తున్న మహిళలు ఈ పథకాన్ని పొందవచ్చు. దీని కోసం ఎటువంటి హామీ లేదా భద్రతను సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ పథకాన్ని పొందడానికి మీ సమీప బ్యాంకును సంప్రదించాలి.