Indian economy: నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించిన సుబ్రహ్మణ్య స్వామి
సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ.. ''భారత్ ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళే ప్రశ్నే లేదని మన ఆర్థిక మంత్రి అన్నారు. అవును.. ఆమె చెప్పింది నిజం. ఎందుకంటే, గత ఏడాదే మన దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాంద్యంలోకి జారుకోవడం అనే ప్రశ్నే తలెత్తదు'' అని ట్వీట్ చేశారు.
Indian economy: దేశ ఆర్థిక వ్యవస్థ, రూపాయి మారక విలువ పతనం గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి వ్యంగ్య ధోరణిలో స్పందించారు. దేశంలో పెరిగిపోతోన్న ధరల సమస్యపై రాజ్యసభలో నిన్న జరిగిన చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ పలు వ్యాఖ్యలు చేసి కేంద్ర ప్రభుత్వ తీరును సమర్థించుకున్నారు. నిజానికి రూపాయి మారక విలువలో పతనం ఏమీ లేదని ఆమె అన్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రూపాయి మారక విలువపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తోందని చెప్పారు.
అలాగే, దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు తలెత్తుతాయన్న ప్రశ్నేలేదని నిర్మలా సీతారామన్ అన్నారు. దీనిపైనే సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ.. ”భారత్ ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళే ప్రశ్నే లేదని మన ఆర్థిక మంత్రి అన్నారు. అవును.. ఆమె చెప్పింది నిజం. ఎందుకంటే, గత ఏడాదే మన దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాంద్యంలోకి జారుకోవడం అనే ప్రశ్నే తలెత్తదు” అని ట్వీట్ చేశారు. కొంత కాలంగా ఆయన బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.