ఆ మూడు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోన్న బర్డ్ ఫ్లూ
Bird Flu: కరోనా వైరస్తో పాటుగా బర్డ్ ఫ్లూ సైతం ఆ 4రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంది. కొద్ది రోజుల క్రితం వరకూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో మాత్రమే కనిపించిన ఈ వైరస్..తాజాగా కేరళ, హిమాచల్ప్రదేశ్లకూ పాకింది. కేరళలోని కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూను గుర్తించినట్లు అధికారులు కన్ఫామ్ చేశారు. ఈ పరిణామంతో గవర్నమెంట్ స్టాఫ్ అప్రమత్తమయ్యారు.
ఇటీవల కేరళ, హిమాచల్ ప్రదేశ్ జిల్లాల్లో అనేక బాతులు, కోళ్లు మృత్యువాతపడ్డాయి. వాటి శాంపుల్స్ ను టెస్టుల కోసం భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్(ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కు పంపించారు. ఆ ఫలితాల్లో వాటికి బర్డ్ఫ్లూ వైరస్ ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాలకు కిలోమీటరు పరిధిలోని ప్రాంతాల్లో ఉన్న బాతులు, కోళ్లు వంటి 40 వేలకు పైగా పక్షులను చంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజలకు ఈ వైరస్ సోకే ప్రమాదమున్న నేపథ్యంలో కొట్టాయం, అలప్పుజ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
హిమాచల్ప్రదేశ్లో..:
హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న పాంగ్ డ్యామ్ లేక్లో బాతులు బర్డ్ఫ్లూ బారిన పడినట్లు అధికారులు పేర్కొన్నారు. సరస్సు అభయారణ్యంలో దాదాపు 1800 వలస పక్షులు వైరస్ కారణంగా చనిపోయినట్లు గుర్తించారు. పక్షుల శాంపుల్స్ను బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపగా వైరస్ ఉన్నట్లు కన్ఫామ్ అయింది.
రాజస్థాన్లో మరో 170
మరోవైపు రాజస్థాన్లో సోమవారానికి 170 వరకు పక్షులు మృతి చెందాయి. ఇటీవల రాష్ట్రంలో 425 పక్షలు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని మృత్యువాత పడటంతో అధికారులు మరింత అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. కాకులు మృతి చెందిన ఝలావర్, బరన్, కోటా, పాలి, జోధ్పుర్, జైపుర్ తదితర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
మధ్యప్రదేశ్లోనూ ఇటీవల కొన్ని చోట్ల ఈ వైరస్ వెలుగుచూసింది. ఇండోర్లో పలు కాకులు మృతి చెందాయి. పలు జిల్లాల్లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ తెలిపారు. ఈ కారణంగా ఇండోర్, మాంద్సౌర్, అగర్-మాల్వా, ఖార్గావ్, సెహోర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిస్థితిని రివ్యూ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.