టీవీ, ఫ్రిజ్, బైక్ ఉన్నాయా.. రేషన్ కార్డ్ కట్
Ration Card:రాష్ట్ర ప్రజలకు ఇచ్చే రేషన్ కార్డులపై ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాష్య వ్యాప్తంగా ఉన్న వారికి టీవీ, ఫ్రిజ్, టూ వీలర్స్ లాంటివి ఉంటే రేషన్ కార్డు వదులుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వమిచ్చే రేషన్కు.. ఉచిత వస్తువులు తీసుకోవడానికి అర్హులు కాదని రాష్ట్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ఉమేశ్ కత్తి మీడియా సమావేశంలో వెల్లడించారు.
‘రేషన్ కార్డులు తీసుకునేందుకు కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి. కార్డు తీసుకోవాలంటే ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు. టీవీ, ఫ్రిజ్, మోటార్సైకిల్ లాంటి వస్తువులు ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్న రేషన్ కార్డుదారులు మార్చి 31లోగా కార్డులను రిటర్న్ చేసేయాలి. లేదంటే వారిపై యాక్షన్ తప్పకుండా తీసుకుంటాం. రూ. 1.20లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం పొందేవారు రేషన్ కార్డులు ఉపయోగించకూడదు’ అని ఉమేశ్ తెలిపారు.
మంత్రి వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు రేషన్ దుకాణాల ఎదుట పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
‘టీవీ, ఫ్రిజ్ లాంటివి ఇప్పుడు నిత్యావసరమయ్యాయి. వడ్డీ లేని రుణాల సదుపాయాలు అందినప్పుడు సాధారణంగానే ప్రజలు ఇలాంటివి కొనుక్కుంటారు. అవి సాకుగా చూపించి రేషన్ తొలగించడం సరికాదు. ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖాదర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.