Russia Soldiers Killed News : యుద్ధంలో 19వేల 300 రష్యా సైనికులు హతం- యుక్రెయిన్ ఆర్మీ
సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 19వేల 300 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ రక్షణశాఖ ప్రకటించింది.(Russia Soldiers Killed News)
Russia Soldiers Killed News : యుక్రెయిన్లో రష్యా అరాచకాలు ఆగడం లేదు. సైనిక చర్య పేరుతో ఆ దేశంలోకి చొరబడిన రష్యా బలగాలు.. యుక్రెయిన్ పౌరుల పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి. ఒకవైపు యుద్ధం.. మరోవైపు యుక్రెయిన్లపై రష్యా బలగాల కీచక పర్వం కొనసాగుతోంది. దీంతో యుక్రెయిన్ ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. రష్యా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో ప్రపంచదేశాలు ఉలిక్కిపడుతున్నాయి.
నెల రోజులకు పైగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలు ఇంకా బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాట మార్చింది. యుక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై ఇంకా క్షిపణులతో విరుచుకుపడుతోంది.
యుక్రెయిన్లో రష్యా సేనలు భారీ విధ్వంసమే సృష్టించాయి. ఈ దాడుల్లో యుక్రెయిన్ సైన్యంతో పాటు సాధారణ ప్రజలూ అనేకమంది చనిపోయారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ బలగాలు రష్యా దాడులను ధీటుగా తిప్పికొడుతున్నాయి. యుక్రెయిన్ సైన్యం ప్రతి దాడులతో రష్యా బలగాలు చుక్కలు చూస్తున్నాయి. ఈ యుద్ధంలో చాలామంది రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు సైతం చేసింది యుక్రెయిన్ ఆర్మీ.(Russia Soldiers Killed News)
Russian Soldiers : ఆగని రష్యా బలగాల ఆరాచకాలు.. భయంతో జుట్టు కత్తిరించుకుంటున్న యుక్రెయిన్ అమ్మాయిలు!
తమ దేశంలో రష్యా కొనసాగిస్తున్న దండయాత్రను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్టు యుక్రెయిన్ ఆర్మీ తెలిపింది. రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 19వేల 300 మంది రష్యా సైనికులు హతమైనట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ ఆదివారం ప్రకటించింది. దీంతోపాటు 722 యుద్ధ ట్యాంకులు, 1911 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 152 యుద్ధవిమానాలు, 137 హెలికాప్టర్లు, 112 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. వీటికి అదనంగా ఏడు నౌకలు, 55 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది.
యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే యుక్రెయిన్ రాజధానిని వశపర్చుకుని ప్రభుత్వాన్ని మార్చవచ్చని పుతిన్ భావించారు. కానీ, ఆ అంచనాలు ఏవీ నిజం కాలేదు. పుతిన్ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ సేనలు తగ్గేదేలా అన్నట్టు పోరాటం సాగిస్తున్నాయి. ఈ యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం జరుగుతోంది. భారీ సంఖ్యలో తన సైనికులను కోల్పోతోంది రష్యా.
సైనిక చర్య పేరుతో యుక్రెయిన్పై రష్యా మొదలుపెట్టిన దురాక్రమణ నెలరోజులకు పైగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు నగరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది రష్యా. కాగా, యుక్రెయిన్పై అణ్వాయుధాలను రష్యా ప్రయోగించవచ్చనే వార్తలు యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేశాయి. దీనిపై స్పందించిన రష్యా.. తమ దేశ ఉనికికి ముప్పు వాటిల్లే సందర్భంలోనే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని తేల్చి చెప్పింది. అంతేకానీ ప్రస్తుతం యుక్రెయిన్ సైనిక చర్యలో మాత్రం కాదని స్పష్టం చేసింది.
కాగా, ఈ యుద్ధం కారణంగా రష్యా దగ్గర పలు కీలక ఆయుధాలు దాదాపుగా నిండుకున్నాయని ఇంగ్లండ్ రక్షణ వర్గాలు చెబుతున్నాయి. వాటిని ఇప్పుడప్పుడే భర్తీ చేసుకునే అవకాశాలు కూడా లేవంటున్నాయి. హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, క్రూయిజ్ మిసైళ్ల కొరత రష్యాను తీవ్రంగా వేధిస్తున్నట్టు చెప్పాయి. పలు కీలక విడి భాగాలను యుక్రెయిన్ నుంచే రష్యా దిగుమతి చేసుకుంటోందని సమాచారం. 2014 క్రిమియా యుద్ధానంతరం రష్యాకు ఆయుధాల ఎగుమతిని ఉక్రెయిన్ బాగా తగ్గించింది. యుద్ధ నేపథ్యంలో అవి పూర్తిగా ఆగిపోయాయి.(Russia Soldiers Killed News)
Russia – Ukraine war: అందుకే పుతిన్ వెనకబడ్డాడా?: యుద్ధానికి వెళ్లమంటూ మొండికేసిన రష్యా బలగాలు
యుక్రెయిన్ బలగాలే కాదు సాధారణ పౌరులు కూడా రష్యా దళాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఉక్రెయిన్లోని కొందరు ఐటీ నిపుణులు బృందంగా ఏర్పడి రష్యా దళాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. వీరు పౌర అవసరాలకు వినియోగించే సాధారణ డ్రోన్లలో మార్పులు చేసి వాటిని రష్యా వాహనాలపై బాంబులు జారవిడిచేందుకు వాడుతున్నారు. ఈ దళంలో చాలా మంది పీహెచ్డీ చేసిన వారు, ఐటీ సహా ఇతర పరిశ్రమల్లో పని చేసే వారున్నారు. వాస్తవానికి ఈ యూనిట్ను 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించిన తర్వాత ప్రారంభించారు. వీరు గతంలో డాన్బాస్ ప్రాంతంలో రష్యా మద్దతుదారులపై పోరాడారు.
రష్యన్ బలగాల ఉపసంహరణ తర్వాత ఉత్తర యుక్రెయిన్లో బుచా పౌరహత్యలు సహా అనేక దారుణాలు వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కీవ్ సమీపంలో మరొక సామూహిక సమాధిని కనుగొన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. బుజోవా గ్రామంలోని పెట్రోల్ బంకు సమీపంలో ఓ పొడవాటి కందకంలో పదుల కొద్దీ పౌరుల మృతదేహాలు కనిపించాయని చెప్పారు.