సునామీకి 15ఏళ్లు: ప్రపంచాన్ని భయపెట్టిన ప్రళయం.. ఎంతమంది చనిపోయారో తెలుసా?
అది డిసెంబరు 26వ తేదీ. 2004వ సంవత్సరం.. ప్రతిరోజులాగే ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయి ఉన్నారు. పెద్దగా టెక్నాలజీ ప్రభావం లేని రోజులు. అనుకోని ప్రళయం.. సముద్రంలో భూకంపం.. దాని పేరే సునామీ. ఇప్పటికి కూడా జనం గుండెల్లో ఆ పేరు వింటేనే వణుకు పుడుతుంది. కూడు.. గుడ్డ.. లేకుండా ప్రజల జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. లక్షల మంది ప్రజలు చనిపోయారు. విలయ ప్రళయం ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో 2లక్షల 30వేల మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. ఈ సునామీ వచ్చి నేటికి(26 డిసెంబర్ 2019) సరిగ్గా 15ఏళ్లు.
మానవ చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి విలయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ భూకంపం తీవ్రతను తొలుత 8.8 గా లెక్కించినా 2005లో 9.0కి సవరించారు. కానీ యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం 9.1గా అంచనా వేసింది. కానీ, 2006లో జరిపిన పరిశోధనల ప్రకారం దాని పరిమాణం 9.1నుంచి 9.3 ఉంటుందని తేల్చింది సర్వే. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీని పరిమాణం ఉజ్జాయింపుగా 9.2గా ఉంటుందని అంచనా వేసింది.
మానవ చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి విలయాల్లో ఒకటిగా నిలిచిన సునామీ కారణంగా భారత్లో సుమారు 10వేల మందికి పైగా మరణించారు. నాటి చేదు గుర్తులను తలుచుకుంటూ నేటికి కూడా సునామీ కారణంగా మరణించినవారి కుటుంబసభ్యులు ఏటా డిసెంబరు 26న కొన్ని ప్రాంతాల్లో సముద్రానికి పూజలు చేస్తుంటారు. పువ్వులతో, పాలతో అభిషేకం చేస్తారు. ఈ సునామీ కారణంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో తొమ్మిది జిల్లాలు ప్రభావితం అయ్యాయి. వందల మంది చనిపోయారు. తీరప్రాంతాల్లో ఇప్పటికీ ఆ ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి.
.