4th Wave : ఆ దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. విపరీతంగా పెరిగిన పాజిటివ్ కేసులు
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మాయదారి కరోనావైరస్ మహమ్మారి వెంటాడుతోంది. పలు దేశాల్లో వైరస్ అదుపులోకి వస్తుండగా మరికొన్ని దేశాల్లో మాత్రం కొత్తగా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా జపాన్లోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంది. ఫోర్త్ వేవ్ భయంతో జపాన్ నగరం ఒసాకా వణికిపోతోంది.
Japan 4th Wave : ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మాయదారి కరోనావైరస్ మహమ్మారి వెంటాడుతోంది. పలు దేశాల్లో వైరస్ అదుపులోకి వస్తుండగా మరికొన్ని దేశాల్లో మాత్రం కొత్తగా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా జపాన్లోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంది. ఫోర్త్ వేవ్ భయంతో జపాన్ నగరం ఒసాకా వణికిపోతోంది. మరికొన్ని రోజుల్లోనే జరిగే ఒలింపిక్స్ వేడుకలకు సన్నద్ధం అవుతున్న వేళ.. వైరస్ భయం ఒసాకా నగరాన్ని వెంటాడుతోంది. వైరస్ ఉద్ధృతి పెరగడంతో జపాన్లో రెండో అతిపెద్ద నగరమైన ఒసాకాతో పాటు మరో ఎనిమిది నగరాల్లోనూ హెల్త్ ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు. జపాన్లో ఇప్పటివరకు 7లక్షల 28వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 12వేల మరణాలు సంభవించాయి. వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించినప్పటికీ తాజాగా వైరస్ ఉద్ధృతి పెరగడం జపాన్ను ఆందోళనకు గురిచేస్తోంది.
కరోనాను కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియంగా విస్తృతంగా జరుగుతోంది. దీంతో కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాయి. కానీ, ఇన్నిరోజులు వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగిన జపాన్లో మళ్లీ కరోనా విజృంభణ కలవరపెడుతోంది. ప్రస్తుతం కరోనా ఫోర్త్ వేవ్ ధాటికి ఒసాకా వణికిపోతోంది. ఇప్పటికే అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ వారంలో 3వేల 849 పాజిటివ్ కేసులు నమోదు కాగా జపాన్లో సంభవిస్తున్న కొవిడ్ మరణాలు దాదాపు 25శాతం ఆ ఒక్క నగరంలోనే ఉంటున్నాయి.
మూడు నెలల క్రితంతో పోలిస్తే ఇవి ఐదు రెట్లు ఎక్కువ. ఇప్పటికే అక్కడి ఆసుపత్రుల్లో 96శాతం బెడ్లు కరోనా పేషెంట్లతో నిండాయి. తాజాగా ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో తీవ్ర లక్షణాలు కనిపిస్తుండడంతో కోలుకోవడం ఇబ్బందిగా మారినట్లు స్థానిక డాక్టర్లు చెబుతున్నారు. ఇలా ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరగడంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బ్రిటన్ రకం వల్లేనా?
దాదాపు 90 లక్షల జనాభా కలిగిన ఒసాకా నగరంలో ఈ నెలలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరగడానికి బ్రిటన్లో వెలుగు చూసిన కొత్తరకం కరోనా వైరస్ కారణమై ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. కొన్నిరోజులుగా పాజిటివ్ నిర్ధారణ అవుతున్న వారిలో 14శాతం మంది ఆసుపత్రిలో చేరుతున్నట్లు గుర్తించారు. ఇక టోక్యోలోనూ కొవిడ్ బాధితుల్లో 37శాతం మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరిలో తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు కోలుకోవడం ఇబ్బందికరంగా మారిందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆసుపత్రుల్లో మందులు, వెంటిలేటర్ల కొరత ఎక్కువ కావడంతో పాటు రోగుల తాకిడిని తట్టుకునేందుకు ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బంది సరిపోవడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఒసాకాలో ఆరోగ్యవ్యవస్థ కుప్పకూలిపోయిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జపాన్ కేవలం ఇప్పటివరకు వైద్య ఆరోగ్య సిబ్బందిలో సగం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందంటున్నారు.
కేవలం 2శాతం వ్యాక్సినేషన్..
మరో తొమ్మిది వారాల్లో జపాన్లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (IOC) సిద్ధమవుతోంది. అయితే, క్రీడలు ప్రారంభమయ్యే నాటికి ఒలింపిక్స్ క్రీడా గ్రామాల్లో దాదాపు 80శాతం మందికి వ్యాక్సిన్ వేస్తామని ఐఓసీ ప్రకటించింది. కానీ, 12.5కోట్ల జనాభా ఉన్న జపాన్లో ఇప్పటివరకు కేవలం 2 నుంచి 3శాతం మందికే వ్యాక్సిన్ అందించారు. క్రీడలకు సమయం దగ్గరపడుతుండడం, వైరస్ ఉద్ధృతి పెరుగుతుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. వ్యాక్సినేషన్ను భారీ స్థాయిలో చేపట్టేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా టోక్యో, ఒసాకా నగరాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.