గాలి ద్వారా కరోనా…6 అడుగుల భౌతిక దూరం సరిపోదు

  • Published By: venkaiahnaidu ,Published On : August 13, 2020 / 09:20 PM IST
గాలి ద్వారా కరోనా…6 అడుగుల భౌతిక దూరం సరిపోదు

కరోనాపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు రోజుకో విషయాన్ని వెల్లడిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని గతంలో చెప్పారు. కరోనా వ్యాప్తి ప్రారంభంలోనే ఆరడుగుల దూరం (రెండు మీటర్లు) భౌతిక దూరం పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పష్టం చేసింది.

అయితే ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వైరాలజీ నిపుణులు చేసిన పరిశోధనలో వైరస్ వ్యాప్తిపై సరికొత్త అంశాలు తెలిశాయి. గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందనడాకి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఇప్పుడున్న మార్గదర్శకాలను సవరించాల్సిన అవసరం ఉందని వాళ్లు చెబుతున్నారు. ఈ వివరాలన్నీ మెడ్‌రెక్సివ్ అనే జర్నల్‌లో ప్రచురించారు.

ఇండోర్‌ వాతావరణంలో 2 నుంచి 4.8 మీటర్ల దూరం వరకు గాలిద్వారా వైరస్‌ సంక్రమిస్తుందని పరిశోధకులు తెలిపారు. చిన్న చిన్న తుంపర్లలోని కరోనా వైరస్‌ అణువులు గాల్లో అలాగే ఉంటున్నాయని పేర్కొన్నారు. దగ్గుతూ, చీదుతూ, మాట్లాడే వారి సమీపంలోని గాలిని పీల్చడం ద్వారా కొవిడ్‌-19 సోకుతుందని స్పష్టం చేశారు.

కోవిడ్-19 రోగులు దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా.. వారికి దగ్గరలో ఉండి గాలిని పీల్చడం ద్వారా వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. కొత్త పరిశోధనలో వైరస్ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో మార్గదర్శకాలు మార్చాల్సిన అవసరం ఏర్పడింది. భౌతిక దూరం మరింత ఎక్కువగా పాటించడం, జనసమ్మర్థ ప్రాంతాల్లోకి వెళ్లకపోవడం వల్ల వైరస్ బారి నుంచి రక్షించుకునే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖాన్ని మరింత జాగ్రత్తగా కప్పుకోవడం మంచిదని, పలుమార్లు చేతులు కడుక్కోవడం అవసరమని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తున్నట్లు తేలడంతో ఆరడుగుల భౌతిక దూరం సరిపోదని.. కనీసం 4.8 మీటర్లు దూరం కంటే ఎక్కువగానే ఉండాలని వారు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా చోట్ల ఆరడుగులు మాత్రమే భౌతిక దూరం పాటిస్తున్నారు. ఇది అంత రక్షణాత్మకం కాదని తెలుస్తుంది. గతంలో ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తే వైరస్ మరింతగా వ్యాపించడం ఖాయమని చెబుతున్నారు.

గతంలో కూడా పలు దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు వైరస్ గాల్లో వ్యాపిస్తున్నదనే ఆధారాలు ఉన్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖలు రాశారు. మొదట్లో వారి వాదనను కొట్టి పారేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తర్వాత అంగీకరించింది. అయితే మరిన్ని పరిశోధనలు అవసరమని చెప్పిన విషయం తెలిసిందే.