Airport: కాబూల్ ఎయిర్పోర్ట్లో తొక్కిసలాట.. ఏడుగురు మృతి!
కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో వందలాది మంది జనం గుమిగూడగా.. జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ఆఫ్ఘన్ పౌరులు చనిపోయారు.

Kabul Airport: కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో వందలాది మంది జనం గుమిగూడగా.. జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ఆఫ్ఘన్ పౌరులు చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ఆక్రమణ తర్వాత చోటుచేసుకుంటున్న పరిస్థితుల్లో ఎయిర్ పోర్టు వద్ద తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపటంతో తొక్కిసలాట జరిగిందని బ్రిటీష్ సైన్యం వెల్లడించింది.
గ్రౌండ్ పరిస్థితులు చాలా దారుణంగా తయారైందని, సాధ్యమైనంతవరకు పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేందుకు మేం చేయగలిగినదంతా చేస్తున్నామని బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. వేలాది మంది ప్రజలు విమానాశ్రయంలోకి రావాలని ప్రయత్నం చేయడంతోనే పరిస్థితి అదుపు తప్పినట్లుగా అభిప్రాయపడుతున్నారు అధికారులు.
కాబూల్లో ప్రస్తుతం పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని, జనాన్ని చెదరగొట్టడానికి తాలిబాన్ తీవ్రవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణ తరువాత, కాబూల్తో సహా అనేక నగరాల్లో గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నారని వారు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వ అధికారుల వ్యక్తిగత ఆదేశం లేకుండా కాబూల్ విమానాశ్రయానికి వెళ్లవద్దని మరోవైపు అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరిస్తుంది.
ఇదిలా ఉంటే మరోవైపు అఫ్గన్ నుంచి ప్రత్యేక విమానం భారత్కు చేరుకుంది. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఏసీ-17 విమానం 168 మందితో ఘజియాబాద్కు చేరుకుంది. వీరిలో 107 మంది భారతీయులు.. 20 మంది అఫ్గన్ హిందువులు, సిక్కులు ఉన్నారు. 168 మందికి ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్షలు చేసిన తర్వాతే బయటకు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు.