బాబోయ్ : పాకిస్తాన్ నుంచి వచ్చి నాశనం చేస్తున్నాయ్
పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులే కాదు.. మిడతలు కూడా భారత్ లోకి చొరబడ్డాయి. పాక్ వైపు నుంచి మన దేశ సరిహద్దుల్లోని భూభాగంలోకి దండెత్తాయి. గుజరాత్కు లక్షలాది మిడతలు వస్తున్నాయి. పంట పొలాలపై పడి నాశనం చేస్తున్నాయి. మిడతల కారణంగా ఆవాలు, ఆముదం, సోంపు, జీలకర్ర, పత్తి, ఆలు, గోధుమ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రోజు రోజుకూ పెరుగుతున్న మిడతలతో బనస్కాంత, సబర్కాంత, మెహ్సానా, కచ్, పటాన్ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అటు స్కూలు పిల్లలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిడతలను అరికట్టడానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తంటాలు పడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. గుజరాత్లో పరిస్థితిని సమీక్షించేందుకు 11 ప్రత్యేక బృందాలను పంపించింది.
ఒక్క బనస్కాంత జిల్లాలోనే 5 వేల హెక్టార్లలో పంటకు నష్టం జరిగింది. గుజరాత్ చేరుకున్న కేంద్ర బృందాలు క్రిమి సంహారక మందులు చల్లించడం సహా అన్ని చర్యలనూ చేపడతాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. డ్రోన్ల సాయంతో క్రిమి సంహారక మందులను చల్లడం సహా అనేక మార్గాలను పరిశీలిస్తున్న అధికారులు.. పొలాల్లో టైర్లను మండించడం, డప్పులు మోగించడం, పొలాల దగ్గర టేబుల్ ఫ్యాన్లు పెట్టడం, లౌడ్ స్పీకర్లతో సంగీతాన్ని వినిపించడం ద్వారా మిడతలను చెదరగొట్టాలని రైతులకు ఇప్పటికే సూచించారు. అయితే వీటితో పెద్దగా ఫలితం ఉండటం లేదు.
బనస్కాంత జిల్లాలో 1,815 హెక్టార్లలో క్రిమిసంహారక మందులను చల్లించినట్టు సీఎం రూపానీ తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన బృందాలతోపాటు రాష్ట్ర అధికారులు సైతం వాటిని పారదోలే పనిలో నిమగ్నమై ఉన్నారని అన్నారు. మిడతల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని, ఇప్పటివరకూ 25 శాతం మిడతలను నిర్మూలించినట్టు అధికారులు వెల్లండిచారు. మరో నాలుగు రోజుల్లో పూర్తిగా వాటి బెడదను తొలగిస్తామని అధికారులు తెలిపారు. మిడతలు దాడిచేసిన పంటలపై క్రిమిసంహారక మందులను చల్లించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి ఆర్సీ ఫల్దూ వివరించారు.
కాగా, దాదాపు దశాబ్దం తర్వాత మిడతల దండు గుజరాత్పై దాడి చేసింది. ఆఫ్రికాలోని సూడాన్, ఎరిత్రియాల నుంచి బయలుదేరిన ఈ మిడతలు సౌదీ అరేబియా, ఇరాన్ గుండా పాకిస్తాన్లోకి ప్రవేశించాయి. సింధ్ రాష్ట్రంలోని ఎడారి ప్రాంతం నుంచి భారత్లో గుజరాత్ చేరాయి. తొలుత ఇవి బనస్కాంత జిల్లాలోని సుయిగామ్, దాంతా, దేశ, పలన్పూర్ గ్రామాల్లోకి ప్రవేశించి, మెల్లగా మెహసనా జిల్లాకు విస్తరించాయి.
ఈ మిడతలకు ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఒక్కో దండు విస్తృతి ఏకంగా 30 నుంచి 35 చదరపు కిలోమీటర్ల మేర ఉంటోంది. గుజరాత్లో ఈసారి నైరుతి రుతుపవనాలు ప్రభావం ఎక్కువ కాలం కొనసాగడంతో మిడతలు అక్కడే తిష్టవేశాయి. రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలోనూ ఇవి ప్రవేశించాయి. మిడతల రాకపై ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) హెచ్చరికలు చేసినా స్థానిక అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదని నిపుణులు చెప్పారు. అయితే, ఉత్తర గుజరాత్ ప్రాంతంపై నెల రోజుల వ్యవధిలోనే మిడతలు రెండోసారి దాడిచేశాయి. రైతుల నుంచి నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో మిడతల కారణంగా పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తామని సీఎం విజయ్ రూపానీ హామీ ఇచ్చారు.