Bangladesh Violence: సేవ్ హిందు నినాదాలతో హోరెత్తిన బంగ్లాదేశ్.. హింసకు కారకుడతనే.. అరెస్ట్!
బంగ్లాదేశ్లోని దుర్గా పూజ మందిరంలో హిందువులపై మతపరమైన హింసను ప్రేరేపించేలా చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు.
Bangladesh anti-Hindu violence: బంగ్లాదేశ్లోని దుర్గా పూజ మందిరంలో హిందువులపై మతపరమైన హింసను ప్రేరేపించేలా చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని ఇక్బాల్ హుస్సేన్గా గుర్తించారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు కారకుడైన వ్యక్తి ఇతనేనని పోలీసులు చెబుతున్నారు. ఖురాన్కు అపచారం కల్గించి, హింసాత్మక దాడులకు ఇక్బాల్ కారణమని చెప్పారు.
సుజ నగర్ ప్రాంతంలో ఉండే ఇక్బాల్ హుస్సేన్ ఖురాన్ను దుర్గా పూజ మండపంలో పెట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించినట్లు ఢాకా మీడియా వెల్లడించింది. నిందితుడు ఇక్బాల్ హుస్సేన్ (35) స్థానిక మసీదులోని ఖురాన్ను తీసుకొచ్చి దుర్గా పూజ మండపంలో పెట్టి, అక్కడ్నుంచి హనుమంతుని విగ్రహం పట్టుకెళ్ళినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. దుర్గా పూజ మండపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించగా.. వాస్తవాలు బయటపడ్డాయని, నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
ఇక్బాల్ హుస్సేన్, వయస్సు 35ఏళ్లు.. కుమిల్లా నగరంలోని సుజనగర్ ప్రాంతానికి చెందిన నూర్ అహ్మద్ ఆలం కుమారుడు అతను. కుమిల్లాలోని ఒక ఆరాధన కమిటీ మత గ్రంథాన్ని అవమానించినట్లు ఆరోపించారు. ఖురాన్ను అపవిత్రం చేసిన వార్త సోషల్ మీడియాలో షేర్ అవగానే రచ్చ జరిగింది. హింసకు ఈ ఘటనే కారణమైంది. బంగ్లాదేశ్లో అనేక దుర్గా పూజ పండళ్లపై దాడి జరిగింది. వీడియో ఫుటేజ్లో, ఖురాన్ కాపీతో హుస్సేన్ రోడ్డుపై నడుస్తున్నట్లు కనిపిస్తోంది. తర్వాత అతని చేతిలో ఖురాన్ కనిపించలేదు. దీంతో నిర్దారణకు వచ్చారు పోలీసులు.
ఇదిలా ఉంటే ఇదే సమయంలో హిందువులు సేవ్ హిందు నినాదాలతో రోడ్డెక్కారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆపాలంటూ ప్రభుత్వాలను కోరుతున్నారు.