రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు : ట్రంప్ పై అభిశంసన…విచారణకు ఆదేశించిన స్పీకర్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ప్రతిపక్ష డెమోక్రటిక్ నాయకులు ఆరోపిస్తున్న సమయంలో ఉభయ సభలకు చెందిన హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నేత, హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసి ట్రంప్ పై అభిశంసన ప్రకటన చేశారు. ట్రంప్ పై స్పీకర్ పెలోసి అభిశంసన విచారణ ప్రారంభించారు.
వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా జోసెఫ్ బైడెన్ పోటీలో నిలవనున్నారు. ఈ సమయంలో జోసెఫ్ బైడెన్ను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్ దేశాధ్యక్షుడుని వొలోడిమర్ జెలెన్స్కీని ఓ ఫోన్ కాల్ ద్వారా ట్రంప్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉక్రెయిన్లో ఉన్న ఓ సంస్థలో బైడెన్ కుమారుడు హంటర్ బైడన్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణ చేపట్టాలని ఉక్రెయిన్ దేశాధ్యక్షుడిని ట్రంప్ బెదిరించినట్లు ఆరోపణలున్నాయి.
అంతేకాకుండా ఉక్రెయిన్కు ఇచ్చేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన 250 మిలియన్ డాలర్ల సైనిక సాయం గురించి కూడా ట్రంప్ బెదిరించారని ఆరోపించారు. ట్రంప్ ప్రభుత్వం ఆ నిధులను సెప్టంబర్ వరకూ విడుదల కాకుండా ఆలస్యం చేసింది. ఈ ఫోన్ కాల్కు దాదాపు వారం ముందు ఉక్రెయిన్కు సైనిక సాయం నిలిపివేయాలని ట్రంప్ తన అధికారులను ఆదేశించినట్లు అమెరికా మీడియా తెలిపింది.
ఉక్రెయిన్కు ఇవ్వాల్సిన మిలిటరీ నిధులను ఆపేసేందుకు కూడా ఆ దేశాధినేతను ట్రంప్ హెచ్చరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో స్పీకర్ పెలోసి ట్రంప్ పై అభిశంసన విచారణ ప్రారంభించారు. ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘించారని, అధ్యక్షుడికి జవాబుదారీ ఉండాలని, చట్టానికి ఎవరూ అతీతులు కారని నాన్సీ పలోసీ అన్నారు.
అయితే పెలోసి ప్రకటనను ట్రంప్ కొట్టిపారేశారు. అయితే తన రాజకీయ ప్రత్యర్థి గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడితో చర్చించింది నిజమేనని ట్రంప్ కూడా అంగీకరించారు. ఉక్రెయిన్ నేతను బెదిరించినట్లు ఆరోపిస్తున్న ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ట్వీట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ అభిశంసన ప్రక్రియ రాజకీయంగా నాకు సానుకూలమే అవుతుందని ట్రంప్ అన్నారు.
ఒకవేళ దిగువ సభలో అభిశంసన జరిగినా…సేనేట్లో మాత్రం రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న కారణంగా ట్రంప్కు ఎటువంటి నష్టం ఉండదని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ ఏ అమెరికా అధ్యక్షుడినీ అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించలేదు. ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో ఇద్దరు దేశాధ్యక్షులను అభిశంసించారు. 1868లో ఆండ్రూ జాన్స్, 1998లో బిల్ క్లింటన్ను అభిశంసించారు. కానీ ఆ ఇద్దరూ సేనేట్ విచారణ నుంచి తప్పించుకున్నారు. ఇక 1973లో రిచర్డ్ నిక్సన్ మాత్రం అభిశంసన అభియోగం రాగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.