Brazil: భారత్ బయోటెక్ ట్రయల్స్ సస్పెండ్ చేసిన బ్రెజిల్

హైదరాబాద్ ఆధారిత భారత్‌ బయోటెక్‌ సంస్థ బ్రెజిల్ వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్‌తో వ్యాక్సిన్‌ డోసుల సరఫరా కోసం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

Brazil: భారత్ బయోటెక్ ట్రయల్స్ సస్పెండ్ చేసిన బ్రెజిల్

Brazil suspends Bharat Biotech Covaxin clinical trials: హైదరాబాద్ ఆధారిత భారత్‌ బయోటెక్‌ సంస్థ బ్రెజిల్ వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్‌తో వ్యాక్సిన్‌ డోసుల సరఫరా కోసం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. కోవాగ్జిన్ సప్లై కోసం జరిగిన 324 మిలియన్ డాలర్ల ఒప్పందంలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలతో డీల్ నుంచి భారత్ బయోటెక్ తప్పుకుంది. దీంతో బ్రెజిల్‌కు సప్లై చేయాల్సిన 20 మిలియన్ డోసుల కోవాగ్జిన్ వ్యాక్సిన్ సరఫరాకు బ్రేక్ పడింది.

గత నవంబర్‌ 20న బ్రెజిల్‌కు చెందిన ప్రెసిసా మెడికామెంటోస్‌, ఎన్విక్సియా ఫార్మాతో భారత్ బయోటెక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో డోసుకు 15 డాలర్లు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందంలో బ్రెజిల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తగా.. మొదట బ్రెజిల్ ఆరోగ్యశాఖ మంత్రి రికార్డో మిరందా చేసిన వ్యాఖ్యలతో ఈ అవినీతి ఆరోపణలు వెలుగుచూశాయి. వ్యాక్సిన్ల కొనుగోలుకు సంబంధించి సందేహాస్పదమైన ఇన్‌వాయిస్‌ను క్లియర్ చేయాల్సిందిగా తనపై పైనుంచి ఒత్తిడి తీసుకొచ్చారని మిరందా ఆరోపించారు.

దీంతో ఈ మొత్తం వ్యవహారంలో బ్రెజిల్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్‌ జోక్యం చేసుకోగా.. మరోవైపు బ్రెజిల్ సెనేట్ ప్యానెల్ కూడా దీనిపై విచారణ జరుపుతోంది. భారత్ బయోటెక్ మాత్రం అన్ని ఆరోపణలను తోసిపుచ్చింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగ ఆమోదం కోసం తాము ప్రతీ నిబంధనను ఫాలో అయ్యామని వెల్లడించింది. అంతర్జాతీయంగా ఆయా దేశాల్లోని చట్టాలకు లోబడే ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలోనే భారత్ బయోటెక్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ క్రమంలోనే బ్రెజిల్ భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.