Punjab : సరిహద్దుల వద్ద పాకిస్థాన్ డ్రోన్ కలకలం..కూల్చివేసిన భారత్
పంజాబ్, ఫిరోజ్ పూర్ సెక్టార్లోని సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ చక్కర్లు కొడుతూ కలకలం రేపింది. దాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే డ్రోన్ను కూల్చివేశారు.
Pak drones India–Pakistan border : పాకిస్థాన్ పదే పదే డ్రోన్లను వినియోగించటం వాటిని భారత్ ఆర్మీ కూల్చివేయటం జరుగుతోంది. ఈ క్రమంలో మరోసారి పాకిస్థాన్ తన పాత బుద్ధినే చూపించింది. సరిహద్దుల్లో డ్రోన్ ను వినియోగించిది. దాన్ని గుర్తించిన భారత్ ఆర్మీ దాన్ని కూల్చి వేసింది. పంజాబ్, ఫిరోజ్ పూర్ సెక్టార్లోని సరిహద్దులో సోమవారం (మార్చి 7,2022)తెల్లవారుజామున ఓ పాకిస్థాన్ డ్రోన్ చక్కర్లు కొడుతూ కలకలం రేపింది. దాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే డ్రోన్ను కూల్చివేశారు. పాకిస్థాన్ ప్రాంతం నుంచి వచ్చిన ఆ డ్రోన్ లో నాలుగు కిలోల నిషేధిత వస్తువులు ఉన్నాయని దాన్ని వెంటనే కూల్చివేశామని సరిహద్దు భద్రతా (BSF) సిబ్బంది తెలిపారు.
ఆ డ్రోన్ కు ఆకుపచ్చ సంచి ఒకటి ఉందని, అది గాల్లో ఉన్న సమయంలోనే గుర్తించామని వివరించారు. ఆ చిన్న సంచిలో పసువు రంగులో నాలుగు ప్యాకెట్లు ఉన్నాయని తెలిపారు. అంతేగాక, మరో నలుపు ప్యాకెట్ కూడా ఉందని తెలిపారు.
మరోవైపు, జమ్మూకశ్మీర్లోని అవంతిపొరలోనూ అలజడి చెలరేగింది. ఆ ప్రాంతంలో జైషే మహ్మద్ కు చెందిన నలుగురు ఉగ్రవాద సానుభూతిపరులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. వారు నలుగురు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారని, ఆయుధాల తరలింపులోనూ సహకరించినట్లు గుర్తించామని వివరించారు.