సోలేమని అంతిమయాత్రలో లక్షల మంది…కన్నీళ్లు పెట్టుకున్న సుప్రీం లీడర్
బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమనిపై అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో సోమవారం(జనవరి-6,2020) సోలెమని శవయాత్ర చేపట్టారు. లక్షల సంఖ్యలో ప్రజలు,సోలేమని అభిమానులు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ .. సులేమానీ కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు. సంతాప ప్రార్థన సమయంలో ఖమేనీ భావోద్వేగానికి లోనయ్యారు. శవపేటిక ముందు నివాళి అర్పిస్తున్న సమయంలో ఖమేనీ ఏడ్చేశారు. శవయాత్రలో పాల్గొన్న జనం కూడా కన్నీరుపెట్టారు. సులేమానీని ఇరాన్ ప్రజలు ఓ హీరోగా భావిస్తారు.
టెహ్రాన్ అంతిమయాత్ర తర్వాత సులేమానీ పార్దీవదేహాన్ని ఖోమ్కు తీసుకువెళ్లనున్నారు. షియా మతస్తులకు ఇది ముఖ్యమైన కేంద్రం. ఆ తర్వాత సులేమానీ స్వంత పట్టణం కిర్మన్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సులేమానీని హత్య చేసి అమెరికన్లు ఎంత తప్పు చేశారో వాళ్లు అంచనా వేయలేకపోతున్నారని ప్రెసిడెంట్ రోహనీ తెలిపారు. క్రేజీ ట్రంప్.. తండ్రిని చంపడంతో అంతా అయిపోయిందనుకుంటున్నారా అని సులేమానీ కూతురు జునాబ్ సులేమానీ వార్నింగ్ ఇచ్చింది.
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్లోని నిఘా విభాగం ఖడ్స్ ఫోర్స్కి మేజర్ జనరల్ ఖాసిం సొలైమని 1998 నుంచి అధిపతిగా కొనసాగుతున్నారు. సరిహద్దు వెలుపల మధ్య ఆసియాలో జరిపే దాడులు ఈ గ్రూప్ ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. సిరియాలో అంతర్యుద్ధం మొదలైన తర్వాత బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చడం, ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్పై పోరులో ఖాసిం కీలక పాత్ర పోషించాడు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లాకి సోలేమనీ ఖాసిం నేరుగా రిపోర్ట్ చేస్తాడు.
1980 నాటి ఇరాక్-ఇరాన్ యుద్ధంతో వెలుగులోకి వచ్చిన ఖాసిం.. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రివల్యూషనరీ గార్డ్స్ ప్రధాన అధికారి అయ్యారు. రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక.. అమెరికా ఆంక్షలతో నాశనమైన ఇరాన్ ఆర్ధిక వ్యవస్థను తిరిగి పునురుద్దరించడంలో సహాయపడ్డాడు. సులేమానీని అమెరికా మాత్రం ఉగ్రవాదిగా చిత్రీకరించి హతమార్చింది. మరోవైపు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ శపథం చేశారు.
అయితే సులేమాని మృతిపై ఇరాక్లో మాత్రం హర్షాతిరేకాలు వెల్లువెత్తినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెబుతున్నారు. ఇందుకు సంబంధించి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో కూడా పోస్టు చేశారు. ఆ వీడియోలో కొందరు యువకులు ఇరాక్ జాతీయ జెండా పట్టుకుని ఆనందంతో వీధుల్లో పరుగెత్తుతున్నారు. సోలేమానీ హత్య మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. గల్ఫ్లో శాంతి భద్రతలే ప్రధానం కావాలని భారత్ కోరింది. ఈ పరిణామాల క్రమంలో గల్ఫ్లో నివాసం ఉంటున్న 10 మిలియన్ల భారతీయుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి.