‘Children-War Crisis’ : బాల్యాన్ని చిదిమేస్తున్న యుద్ధ సంక్షోభం..చిన్నారులపై అంతులేని అకృత్యాలు
యుద్ధం. ప్రాణ, ఆస్తి నష్టాలే కాదు. యుద్ధ జరిగే దేశాల్లో బాలల బంగారు భవిష్యత్తులను నిర్ధాక్ష్యిణ్యంగా కాలరాసేస్తుంది. చిన్నారుల జీవితాలను ఛిద్రంచేసేస్తుంది. అలా యుద్ధం సంక్షోభం కారణంగా వేలాదిమంది చిన్నారుల జీవితాలు ఛిద్రమైపోయాయని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.
‘Children-War Crisis’UN Report : యుద్ధం. ప్రాణ, ఆస్తి నష్టాలే కాదు. యుద్ధ జరిగే దేశాల్లో బాలల బంగారు భవిష్యత్తులను నిర్ధాక్ష్యిణ్యంగా కాలరాసేస్తుంది. చిన్నారుల జీవితాలను ఛిద్రంచేసేస్తుంది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం..కళ్లముందే అయినవారిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఏం జరుగుతుందో తెలియక..కుప్పకూలిన శిథిలాలను చూస్తూ..గాజాలో ఓ బాలిక ఏడుస్తూ..‘ఇట్స్ నాట్ ఫెయిర్’.. నా వయస్సు పదేళ్లు.. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను. నేను డాక్టర్అయ్యి..ఇక్కడి ప్రజలకు ఏదో చేయాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడేం చేయలేకపోతున్నాను. ఈ కష్టాన్ని ఇంక భరించలేకపోతున్నాను. నాకు చాలా భయంగా ఉంది. ఇది చూస్తోంటే రోజూ ఏడుపు వస్తోంది.. మమ్మల్ని ఎందుకు ఇలా బాధిస్తున్నారు? అంటూ వేసిన ప్రశ్నలకు ఏ దేశాధినేత సమాధానం చెబుతారు? ఛిన్నాభిన్నం అయిపోయిన వారి జీవితాలను ఎవరిది బాధ్యత? ఏదేశం అయినా ఏ మతంవారైనా చిన్నారుల జీవితాలను ఛిద్రం చేసే హక్కు ఎవరిచ్చారు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం ఉండదు.
శిథిలమైపోయిన ఇళ్లమధ్య..ఛిద్రమైపోతున్న బాల్యం గురించి ఎవరికి పడుతుంది? ఇటువంటి పరిస్థితులు ఒక్క ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్యే కాదు..యుద్దాలు జరిగిన..జరుగుతున్న దేశాలల్లో బాలల పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఈక్రమంలో ఐక్యరాజ్యసమితి ‘పిల్లలు– యుద్ధ సంక్షోభం’ అనే నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో యుద్ధ సంక్షోభం బాల్యాలను ఎలా ఛిధ్రం చేస్తోందో తెలిస్తే భయాందోళనలకు గురి కావాల్సిందే. నేటి బాలలే రేపటి పౌరులు అనే మాటకు అర్థం ఏమిటి? వారి భవిష్యత్తులు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితిలు యుద్ధాలు జరిగే దేశాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
రాజకీయాల కోసం..అధికారం కోసం..ఒకదేశంపై మరో దేశం పెత్తనం కోసం ఇలా కారణాలు ఏమైనాగానీ..వివిధ దేశాల్లో సాగుతున్న సంక్షోభాలతో పిల్లల భవిష్యత్ నాశనమవుతోంది. యుద్ధ సంక్షుభిత దేశాల్లో పిల్లలపై అకృత్యాలు భారీగా పెరగడమే దీనికి కారణమని తెలుస్తోంది. గత సంవత్సరం కరోనా మహమ్మారి సమయంలో మూత పడిన స్కూళ్లతో పిల్లలు ఇంటికే పరిమితం అయిపోయారు. దీని వల్ల కూడా చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. దీనిపై ఐక్యరాజ్యసమితి ‘పిల్లలు– యుద్ధ సంక్షోభం’ అనే నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం గత సంవత్సరం పిల్లలపై 26,425 అకృత్యాలు జరిగాయని వెల్లడైంది. వాటిలో గత సంవత్సరమే అంటే 2020లో పిల్లలపై 23,946 ఘటనలు జరిగితే.. అంతకుముందు సంవత్సరం జరిగిన 2,479 ఘటనలను 2020లో ఐరాస ధ్రువీకరించింది. వీటిల్లో కిడ్నాపులు, లైంగిక దాడులు, హింసలు ఉన్నాయి. సంఘర్షణ, సాయుధ ఘర్షణలు,అంతర్జాతీయ మానవతా చట్టం,అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని విస్మరించడం పిల్లల రక్షణపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిందని నివేదిక పేర్కొంది.
ఈక్రమంలో ఆయా ఘటనల్లో 19,379 (14,097 బాలురు, 4,993 బాలికలు) మంది పిల్లలు బాధితులుగా మారారు. అల్లర్లు లేదా దాడుల కోసం పిల్లలను నియమించుకుని వారిని వాడుకోవడం, చంపడం, కొట్టడం, లైంగిక దాడులు, కిడ్నాప్ చేయడం వంటి దారుణాలు పిల్లలపై జరిగాయి. ఆఫ్ఘనిస్థాన్, సిరియా, యెమన్, సోమాలియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాల్లో ఎక్కువగా జరిగాయి.
ఆయా ఘటనల్లో ఎక్కువగా 8,521 మంది పిల్లలను దాడులు, ఇతర అసాంఘిక కార్యకలాపాల కోసం వాడుకునేందుకు నియమించారు. 2,674 మంది పిల్లలను చంపేశారు. 5,748 మందిని చావబాదారు. 4,156 మంది పిల్లలకు కనీసం దయ లేకుండా చేశారు. 3,243 మంది పిల్లలను కిడ్నాప్ చేసి బంధీలుగా మార్చారు. ఆసుపత్రులపై దాడులు తగ్గినా.. స్కూళ్లపై ఎక్కువయ్యాయి. ప్రధానంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(DRC), సోమాలియా, సిరియా మరియు మయన్మార్లలో పిల్లలు ఎక్కువగా బాధింపబడటం…మరణించటం..వారి జీవితాలు అగమ్యగోచరంగా మారటం జరుగుతోంది. కిడ్నాపులు..లైంగిక హింసలు, లైంగిక దాడులు వంటివి పిల్లలపై 70 నుంచి 90 శాతం పెరిగాయి. యుద్ధాలు 2020లో మళ్లీ మిలియన్ల మంది బాలురు,బాలికల బాల్యాన్ని చిదిమేశాయని తేలింది.