China : ముగ్గురు పిల్లలను కనండి.. కొత్త పాలసీకి చైనా ఆమోదం
చైనా కీలక నిర్ణయం తీసుకుంది. కీలక చట్టానికి ఆమోద ముద్ర వేసింది. ముగ్గురు పిల్లలను కనేందుకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ముగ్గురు పిల్లల పాలసీకి
China : చైనా కీలక నిర్ణయం తీసుకుంది. కీలక చట్టానికి ఆమోద ముద్ర వేసింది. ముగ్గురు పిల్లలను కనేందుకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ముగ్గురు పిల్లల పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చైనాలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ 13వ స్టాండింగ్ కమిటీ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం దక్కింది. జనాభా, కుటుంబ నియంత్రణ చట్టాన్ని కూడా సవరించారు. దీంతో ముగ్గురు పిల్లల విధానానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆ చట్టాలను అమలు చేయాలన్న పత్రాలపై చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సంతకం చేశారు.
చైనాలో 60 ఏళ్ల వయసు దాటిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశం ముగ్గురు పిల్లల విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత 40 ఏళ్ల నుంచి ఆ దేశంలో ఒక జంట ఒక్కర్నే కనాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు జనాభా, కుటుంబ నియంత్రణ చట్ట సవరణతో ఆ సంఖ్య మూడుకు చేరింది.
త్రీ చైల్డ్ పాలసీ:
ముగ్గురు పిల్లల్ని కనే దంపతులకు చైనా ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వనున్నది. ఫండింగ్, ట్యాక్సేషన్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, హౌజింగ్, ఎంప్లామెంట్లో వారికి చేయూతనివ్వనున్నారు. గత మే నెలలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ త్రీ చైల్డ్ పాలసీని సమర్ధించింది. ఇది దేశ జనాభా స్వరూపాన్ని మార్చేస్తుందని, వయసు మళ్లుతున్న వారి సంఖ్యకు తగినట్లు కొత్త తరం వస్తుందన్నారు.
2020 జనాభా లెక్కల ప్రకారం.. చైనా జనాభాలో 60 ఏళ్లు దాటిన వారి శాతం 18.7 గా ఉంది. 2010తో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు. రెండో బిడ్డను కనేందుకు 2013లో చైనా ఆమోదించింది. పెళ్లి చేసుకున్న దంపతులు కచ్చితంగా ఇద్దర్ని కనొచ్చు అంటూ 2016లో మరో చట్టం చేశారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. జనాభా నియంత్రణకు చైనా గతంలో వన్ చైల్డ్ పాలసీ తీసుకొచ్చింది. దాదాపు 30ఏళ్లకు పైగానే ఈ పాలసీ అమలు చేసింది. దీంతో జనాభా నియంత్రణ అయ్యింది. 400 మిలియన్ల పుట్టుకలు ఆగాయి. కానీ కొత్త సమస్య వచ్చి పడింది. ఆ దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. యువత సంఖ్య తగ్గింది. దీంతో చైనా అలర్ట్ అయ్యింది. వన్ చైల్డ్ పాలసీని మార్పు చేసి టు చైల్డ్ పాలసీ తెచ్చింది. ఇప్పుడు త్రీ చైల్డ్ పాలసీకి ఆమోదం తెలిపింది.