China : వీడియో గేమ్స్పై ఆంక్షలు, వారంలో మూడు గంటలు మాత్రమే ఆడాలి
నిన్న మొన్నటి వరకు పిల్లలు కనడంపైన ఆంక్షలు పెట్టిన దేశం ఏదో తెలిసిందే. తాజాగా.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి పిల్లలు ఆడే వీడియో గేమ్స్ పై కన్నేసింది.
China Bans : నిన్న మొన్నటి వరకు పిల్లలు కనడంపైన ఆంక్షలు పెట్టిన దేశం ఏదో తెలిసిందే. తాజాగా.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి పిల్లలు ఆడే వీడియో గేమ్స్ పై కన్నేసింది. 18 ఏళ్ల వయస్సులోపు వారు ఇకపై వారంలో మూడు గంటలు మాత్రమే ఆడుకునేలా కొత్త విధివిధానాలు తీసుకొచ్చింది. 2021, సెప్టెంబర్ 01వ తేదీ బుధవారం నుంచి ప్రతీ శుక్రవారం, వీకెండ్స్, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గేమ్స్ ఆడుకొనేలా అవకాశం కల్పిస్తున్నట్టు నేషనల్ ప్రెస్ అండ్ పబ్లికేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
Read More : Chinese Apps : నిషేధాన్ని ధిక్కరిస్తూ.. ఇండియాలో గుట్టుగా పెరిగిపోతున్న చైనా యాప్స్!
2019లో జారీ చేసిన నిబంధనల ప్రకారం రోజుకు గంటన్నర, ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు గంటల చొప్పున ఆడుకొనే వెసులుబాటు మైనర్లకు ఉంది. ఇప్పుడు ఆ సమయాన్ని మరింతగా కుదిస్తూ వారంలో కేవలం మూడు గంటలకే పరిమితం చేస్తూ ‘చైనా’ ఆంక్షలు విధించింది. ఈ కొత్త నిబంధనలతో చైనాలోని గేమింగ్ దిగ్గజం టెన్సెంట్తో పాటు అలీబాబా తదితర అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుంది.
Read More : 1km-Long Orbit Spaceship : స్పేస్ రేసులో చైనా కొత్త ట్విస్ట్ : కిలోమీటర్ పొడవైన భారీ స్పేస్షిప్ ప్లాన్!
ఇటీవల చైనా ప్రభుత్వ అనుబంధ పత్రిక ఒకటి గేమింగ్ పరిశ్రమపై విమర్శలు చేయడంతో పాటు ఇలాంటి గేమ్లను ఓ మత్తుమందుగా పేర్కొంది. అలాగే, గేమింగ్ కంపెనీలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు నిబంధనల అమలును పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే.. డ్రాగన్ కంట్రీ తాజా నిబంధన దేశంలోని గేమింగ్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించనుందంటున్నారు నిపుణులు.