భారత్‌ నుంచి ప్రత్యేక విమానాలను రద్దు చేసిన చైనా

  • Published By: bheemraj ,Published On : November 6, 2020 / 01:27 AM IST
భారత్‌ నుంచి ప్రత్యేక విమానాలను రద్దు చేసిన చైనా

China cancel flights : భారత్‌ నుంచి ప్రత్యేక విమానాలను చైనా రద్దు చేసింది. వందే భారత్‌ మిషన్‌ కింద నడుపుతున్న ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమాన సర్వీసులను తదుపరి ఆదేశాల వరకు నిలిపివేసినట్లు తెలిపింది. భారత్‌లో కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ప్రకటించింది.



అలాగే భారత్‌లోని విదేశీయులు చైనాలోకి ప్రవేశంపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. చెల్లుబాటు అయ్యే చైనా వీసా, రెసిడెన్స్‌ పర్మిట్‌ ఉన్నప్పటికీ వారిని తాత్కాలికంగా తమ దేశంలోకి అనుమతించబోమని చెప్పింది. భారత్‌లోని చైనా రాయబార, దౌత్య కార్యాలయాలు వారి ఆరోగ్య ధృవీకరణ ప్రతాలపై స్టాంప్‌ వేయరని పేర్కొంది.



అత్యవసరాలకు చైనా సందర్శించాలనుకునే విదేశీయులు భారత్‌లోని చైనా రాయబార, దౌత్య కార్యాలయాల్లో వీసా కోసం దరఖాస్తు చేయాలని తెలిపింది. చైనాలోకి ప్రవేశం కోసం నవంబర్ 3 తర్వాత జారీ చేసిన వీసాలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. భారత్‌లో కరోనా పరిస్థితులను సమీక్షించి ఆ మేరకు విమాన ప్రయాణ అనుమతులను పరిశీలిస్తామని చైనా వెల్లడించింది.



గత వారం ఢిల్లీ నుంచి వుహాన్ చేరిన ప్రయాణికుల్లో 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి చైనాకు ప్రత్యేక విమానాల నిలిపివేతపై ఆ దేశం ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది.