భారత్ కన్నా చైనా,పాక్ లోనే ఎక్కువ అణ్వాయుధాలు
చైనా,పాకిస్తాన్ దేశాల దగ్గర మనకంటే ఎక్కువగా అణ్వాయుధాలు ఉన్నాయని స్వీడన్కు చెందిన ద స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(SIPRI)సోమవారం తెలిపింది. ప్రస్తుతం లడఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్- చైనా మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో.. ఈ వివరాలు బయటకు రావడం ప్రాముఖ్యం సంతరించుకుంది.
స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(SIPRI) విడుదల చేసిన ఇయర్ బుక్ 2020 ప్రకారం….చైనా, పాకిస్థాన్ ల దగ్గర భారత్ కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నట్లు తేలింది. ప్రపంచంలో ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా దేశాల దగ్గర అణ్వాయుధాలున్నాయి. జనవరి 2020 నాటికి ఈ దేశాలన్నింటి దగ్గర మొత్తం 13,400 అణ్వాయుధాలు ఉన్నట్లు ఈ అంతర్జాతీయ సంస్థ అంచనా వేసింది. ఇందులో చైనా దగ్గర 320 న్యూక్లియర్ వార్హెడ్లు ఉండగా.. పాక్ దగ్గర 160, ఇండియా దగ్గర 150 ఉన్నాయని ‘ఇయర్ బుక్ 2020’లో SIPRI తెలిపింది.
1966లో స్వీడన్ ప్రభుత్వం స్థాపించిన SIPRI.. ప్రపంచ దేశాల ఆయుధ బలాబలాలు, అంతర్జాతీయ భద్రతను అంచనా వేస్తుంది. రష్యా వద్ద 6,375…, అమెరికా వద్ద 5,800 అణ్వాయుధాలు ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోని 90 శాతం కన్నా ఎక్కువ అణ్వాయుధాలు రష్యా, అమెరికా వద్దే ఉన్నాయని SIPRI వివరించింది. అంతర్జాతీయంగా అన్ని దేశాలూ తమ అణుబలగాన్ని ఆధునీకరిస్తున్నాయని తెలిపింది. అయితే, 2019లో ప్రపంచ వ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య తగ్గినట్లు ఈ సంస్థ ప్రకటించింది. గత సంవత్సరం 13,865గా ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 13,400కి చేరినట్లు పేర్కొంది.
భారత్, పాక్ సహా పలుదేశాలు అణ్వాయుధ సమాచారాన్ని దాచిపెడుతున్నాయని SIPRI ఆరోపించింది. కాగా, చైనా గతంలో కంటే ఎక్కువగా బలప్రదర్శన చేస్తోందని విశ్లేషించింది. ఈ సంస్థ కథనం ప్రకారం సైనిక వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల్లో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది.