Covid May Become Seasonal : సీజనల్ వ్యాధిగా కరోనా, బాంబు పేల్చిన ఐక్యరాజ్య సమితి

వ్యాక్సిన్ వచ్చినా కరోనా తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కొత్త రూపాల్లో కొవిడ్ విజృంభిస్తోంది. దీంతో ప్రజల్లో ఇంకా భయాందోళనలు తొలగలేదు. కరోనా పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి మరో బాంబు పేల్చింది.

Covid May Become Seasonal : సీజనల్ వ్యాధిగా కరోనా, బాంబు పేల్చిన ఐక్యరాజ్య సమితి

Corona India

covid may become seasonal, un says : చైనాలో తొలుత బయటపడిన కరోనావైరస్ మహమ్మారి ఏడాదిన్నరగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 11.95 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 26.50 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.06 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు. వ్యాక్సిన్ వచ్చినా కరోనా తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కొత్త రూపాల్లో కొవిడ్ విజృంభిస్తోంది. దీంతో ప్రజల్లో ఇంకా భయాందోళనలు తొలగలేదు. కరోనా పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి మరో బాంబు పేల్చింది.

కరోనావైరస్ మహమ్మారి గురించి ఐక్యరాజ్య సమితి మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. కరోనా.. సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు వాతావరణ అంశాల ఆధారంగా కరోనా నిబంధనలకు సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచదేశాలకు సూచించింది. కరోనా వ్యాప్తిపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ప్రభావాలపై యూఎన్ నిపుణుల బృందం అధ్యయనం చేసింది. దాని ఆధారంగా ఈ హెచ్చరిక జారీ చేసింది.

శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లు తరచూ సీజనల్‌గా మారతాయని ఈ నిపుణుల బృందం వెల్లడించింది. శీతకాలంలో ఇన్‌ఫ్లూయెంజా విజృంభణ ఉంటుందని, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో జలుబు కలిగించే కరోనా వైరస్ వ్యాప్తి ఉంటుందని వెల్లడించింది. ఈ తీరు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగితే, కొవిడ్-19 సీజనల్ వ్యాధిగా అభివృద్ధి చెందే అవకాశం ఉందంది.

ఇదిలా ఉండగా..ఇప్పటివరకు కొవిడ్-19 వ్యాప్తి వాతావరణ అంశాల కంటే ప్రభుత్వం విధించే నిబంధల ద్వారానే ఎక్కువగా ప్రభావితమైంది. మాస్కులు, ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటి ప్రభుత్వ చర్యలు కరోనా వ్యాప్తిని దాదాపుగా కట్టడి చేస్తున్నాయి. అందువల్ల వాతావరణ అంశాల ఆధారంగా మాత్రమే ఆంక్షల సడలింపు దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించలేవని నిపుణుల బృందం వెల్లడించింది.

కొన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణంలో కూడా ఈ మహమ్మారి విజృంభించిందని, రాబోయే సంవత్సరంలో ఇలాగే జరగదని చెప్పడానికి ఆధారాలు లేవని తెలిపింది. చల్లని, పొడి వాతావరణంలో, తక్కువ స్థాయిలో అతినీలలోహిత కిరణాల ప్రసారం ఉన్నప్పుడు వైరస్ ఎక్కువ కాలం మనుగడ సాగించినట్లు గుర్తించామంది. వైరస్ ప్రసారంపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నదానిపై స్పష్టత రావాల్సి ఉందంది. మరోవైపు వాయు కాలుష్యం మరణాల రేటు పెంపునకు దోహదం చేస్తుందని, వైరస్ ప్రసారంపై మాత్రం నేరుగా ప్రభావం చూపదని కొన్ని అధ్యయనాలు ప్రాథమికంగా వెల్లడిచేస్తున్నాయి.