ముస్లిం ప్రయాణికులను దిగిపొమ్మన్నందుకు రూ.36లక్షల ఫైన్
విమానంలో ప్రయాణిస్తున్న ముస్లిం ప్రయాణికులను దిగి పొమ్మనందుకు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆ ఎయిర్లైన్స్కు 50వేల డాలర్లు(రూ.36లక్షలు) ఫైన్ వేసింది. వివక్ష కింద పరిగణిస్తూ చట్టానికి వ్యతిరేకంగా ముగ్గురు ముస్లిం ప్రయాణికుల విషయంలో ప్రవర్తించిందని ఆదేశాలు జారీచేసింది.
2016 జులై 26న ముస్లిం జంట పారిస్లోని చార్లెస్ డె గౌలె ఎయిర్పోర్టులో డెల్టా ప్లైట్ 229 ఎక్కారు. వారిని ఓ అటెండెంట్ వచ్చి ‘మీ ప్రవర్తనకు నాకు భయంగానూ అసౌకర్యంగానూ అనిపిస్తుంద’ని అన్నాడు. అందులో మహిళ తలకు ముసుగు ధరించి ఉండటం, ఆ వ్యక్తి వాచ్లో ఏదో పెట్టుకోవడం గమనించాడు. అంతేకాకుండా సెల్ ఫోన్లో పలు మార్లు కత్తి సింబల్ వాడుతూ అల్లాహ్ అంటూ టైప్ చేశాడని ఆ అటెండెంట్ చెప్పింది.
కెప్టెన్.. డెల్టా కార్పొరేట్ సెక్యూరిటీతో మాట్లాడి వారు అమెరికన్ సిటిజన్లు ఇంటికి తిరిగి వెళ్తున్నారని చెప్తున్నా.. మళ్లీ ఫ్లైట్ ఎక్కేందుకు నిరాకరించాడు.
మరో ఘటన 2016 జులై 31న ఫ్లైట్ నెంబర్ 49లో ఆమ్స్టర్డమ్ దగ్గర జరిగింది. ఇతర ప్రయాణికులు, విమానంలో ఉన్న అటెండెంట్లు కంప్లైంట్ చేశారు. డెల్టా సెక్యూరిటీ మాత్రం అనుమానస్పదంగా ఏమీ లేవని.. గతంలోనూ అతనిపేరిట ఎలాంటి రిమార్క్లు లేవని చెప్పారు. అయినప్పటికీ ప్రయాణికుడ్ని నిరాకరించింది ఆ ఎయిర్లైన్స్.
తమపై వివక్ష చూపారంటూ బాధితులు డెల్టా ఎయిర్ లైన్స్ పై కంప్లైంట్ చేశారు. వీటిపై ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ విచారణ జరిపింది. భవిష్యత్లో ఇటువంటివి పునరావృతం కాకూడదని ఈ తీర్పునిచ్చినట్లు వెల్లడించింది.