ట్రంప్ సంచలన ప్రకటన…అమెరికాలోకి విదేశీయులకు నో ఎంట్రీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసలదారులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతున్న ప్రస్తుత సమయంలో గ్రెట్ అమెరికన్ల ఉద్యోగాలను కాపాడాల్సిన అవసరముంది. అమెరికాలోకి వచ్చే వలసపై తాత్కాలికంగా నిషేధం విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై నేను సంతకం చేస్తున్నాను అంటూ ట్రంప్ ఆ ట్వీట్ లో తెలిపారు. లాక్ డౌన్ ను ఎత్తివేయాలంటూ వందలాదిమంది మంది అమెరికన్లు రోడ్లపైకి వస్తున్న సమయంలో వారికి మద్దతు తెలుపుతూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా,అమెరికాలో ఇప్పటికే వేలాదిమంది భారతీయులు,చైనీయులు ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
కాగా, దేశ చరిత్రలో తొలిసారిగా అమెరికా చమురు ధరలు పడిపోవడంతో దేశీయ వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్లో 75 మిలియన్ బారెల్స్ చమురును చేర్చాలని ప్రకటించిన వెంటనే ఇమ్మిగ్రేషన్పై ట్రంప్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. అమెరికాకు ప్రధాన పెట్రోలియం ఉత్పత్తిదారులు సౌదీ అరేబియా, రష్యాలో కూడా కరోనా నేపథ్యంలో ప్రతికూల వాతావరణం నెలకొనడంతో యూఎస్లో చమురు ధరలపై ప్రభావం చూపింది. మేము మా జాతీయ పెట్రోలియం నిల్వలను నింపుతున్నాము. 75 మిలియన్ బారెళ్లను నిల్వల్లో ఉంచాలని మేము చూస్తున్నాము అని ట్రంప్ మరో ట్వీట్ లో తెలిపారు.
నవంబర్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కరోనా వల్ల ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య సంక్షోభంపై ట్రంప్ మండిపడుతున్నారు. దీని ప్రభావం ఎక్కడ ఎన్నికల ఫలితాలపై పడుతుందోనని కూడా ఆయన భయపడుతున్నారు. ఈ మహమ్మారి బారి నుంచి బయటపడడం ఎలాగో తెలియక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో కరోనా మహమ్మారికి కారణం ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)అంటూ ఫైర్ అయ్యారు. డబ్ల్యూహెచ్ఓకు నిధులను కూడా నిలిపి వేశారు. ఇక ‘కొవిడ్-19’ వూహాన్ ల్యాబ్ నుంచే పుట్టిందని ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ చైనా పని అని తేలితే తీవ్రపరిణామాలు ఉంటాయని కూడా ఆయన నేరుగా హెచ్చరించారు.
అయితే ఇప్పటివరకు అమెరికాలో కరోనా సోకినవారిసంఖ్య 792,913గా ఉండగా,మరణాల సంఖ్య 42,517గా ఉంది. 72,389మంది కోలుకున్నారు. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా 252,094కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక అమెరికాలో కరోనా మరణాలు కూడా ఎక్కువగా న్యూయార్క్ లోనే నమోదయ్యాయి. న్యూయార్క్ లో కరోనా మరణాల సంఖ్య 18,929కి చేరుకుంది.
In light of the attack from the Invisible Enemy, as well as the need to protect the jobs of our GREAT American Citizens, I will be signing an Executive Order to temporarily suspend immigration into the United States!
— Donald J. Trump (@realDonaldTrump) April 21, 2020