Dubai Hindu Temple: దుబాయ్లో హిందూ దేవాలయం.. నేడు భక్తుల సందర్శనార్థం తెరచుకోనున్న ఆలయం.. ఇక్కడ ప్రత్యేకతలు ఏమిటంటే?
దుబాయ్లో నూతనంగా నిర్మించిన హిందూదేవాలయాన్ని బుధవారం భక్తులకోసం తెరవనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయం యూఏఈలోని బెబెలీ అలీ ప్రాంతంలో ఉంది. అయితే, దుబాయ్లో కేవలం రెండు హిందూ దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో మొదటిది 1958లో నిర్మించబడింది. రెండవది.. ప్రస్తుతం కొత్తగా ప్రారంభించిన హిందూ దేవాలయం. ఈ దేవాలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
Dubai Hindu Temple: దుబాయ్లో నూతనంగా నిర్మించిన హిందూదేవాలయాన్ని బుధవారం భక్తులకోసం తెరవనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయం యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లోని బెబెలీ అలీ ప్రాంతంలో ఉంది. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆలయాన్ని మంగళవారం ఆ దేశ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ముఖ్యఅతిథిగా, యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ గౌరవ అతిథిగా హాజరై ప్రారంభించారు.
అయితే భద్రతా కారణాల రిత్యా భక్తులను అనుమతించలేదు. దసరా పర్వదినం సందర్భంగా భక్తుల దర్శనార్ధం బుధవారం ఈ ఆలయాన్ని తెరవనున్నారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ) ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం హిందూ దేవాలయం అధికారిక ప్రారంభ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త రాజు ష్రాఫ్ తెలిపారు.
ఈ నూతన ఆలయం దీపావళి ఉత్సవాల తరువాత ప్రతిరోజూ జరిగే హారతి కార్యక్రమంతో ఆలయం అందరికీ అందుబాటులో ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ముస్లిం దేశంలో నిర్మించిన ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దుబాయ్లోని జెబెల్ అలీలోని వర్షిప్ విలేజ్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం కోసం యూఏఈ ప్రభుత్వం 2019లో భూమిని కేటాయించింది. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా ఆలయ నిర్మాణం మూడేళ్లు పట్టింది.
ఆలయంలో విలక్షణమైన వాస్తుశిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. పర్యాటకులను ఆకట్టుకునేలా రూపుదిద్దారు. ఆలయం మొత్తం 80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. గురు గ్రంథ్ సాహిబ్తో పాటు శివుడు, కృష్ణుడు, గణేష్, మహాలక్ష్మితో సహా 16 మంది దేవతలను ఈ ఆలయంలో ఉంచారు. ఆలయం బయటి గోపురాలపై తొమ్మిది ఇత్తడి గోపురాలు, కలశాలను కలిగి ఉంది. ప్రార్థన మందిరంలో 105 ఇత్తడి గంటలు అమర్చారు.
దుబాయ్లో కేవలం రెండు హిందూ దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో మొదటిది 1958లో నిర్మించబడింది. రెండవది.. ప్రస్తుతం కొత్తగా ప్రారంభించిన హిందూ దేవాలయం. ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునేవారు ఆలయ వెబ్సైట్ ద్వారా ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. సందర్శకులు, భక్తులు వారి పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, సందర్శకుల సంఖ్యను అందించిన తర్వాత అరగంటలో స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. గరిష్టంగా నలుగురు సందర్శకులు అనుమతిస్తారు. ఉదయం 6 నుండి రాత్రి 8.30 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. అయితే సందర్శకులు సాంప్రదాయ దుస్తులను దరించాల్సి ఉంటుంది.