US B-21 Stealth Bomber : అగ్రరాజ్యం అల్ట్రామోడ్రన్ విమానం US B-21 Raider ప్రత్యేకతలు
అగ్రరాజ్యం మిలిటరీ అమ్ములపొదిలో మరో అల్ట్రామోడ్రన్ విమానం చేరింది. దాని పేరే బి-21 రైడర్ (B-21 Raider). ఇప్పటిదాకా రూపొందించిన మిలిటరీ విమానాల్లో ఇదే అత్యంత అధునాతనమైనంది అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. అమెరికా అమ్ములపొదిలోని బి-1 లాన్సర్, బి-2 స్పిరిట్ బాంబర్ల స్థానంలో బి-21ను ప్రవేశపెట్టబోతున్నారు.
US B-21 Stealth Bomber : అత్యాధునిక ఆయుధాన్ని సిద్ధం చేసుకుంది అమెరికా. అగ్రరాజ్యం మిలిటరీ అమ్ములపొదిలో మరో అల్ట్రామోడ్రన్ విమానం చేరింది. దాని పేరే బి-21 రైడర్ (B-21 Raider). ఇప్పటిదాకా రూపొందించిన మిలిటరీ విమానాల్లో ఇదే అత్యంత అధునాతనమైనంది అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. అమెరికా అమ్ములపొదిలోని బి-1 లాన్సర్, బి-2 స్పిరిట్ బాంబర్ల స్థానంలో బి-21ను ప్రవేశపెట్టబోతున్నారు.
ఇప్పటికే చైనా చెలరేగిపోతోంది. అత్యాధునిక ఆయుధాల్ని సమకూర్చుకుంటోంది. 2035 నాటికి 1500 అణ్వస్త్రాలను సమకూర్చునే దిశగా అడుగులు వేస్తోంది. హైపర్సోనిక్స్, సైబర్ వార్ఫేర్తో పాటు అంతరిక్షంలోనూ టాప్ పొజిషన్లో ఉంది. చైనా చర్యలతో తమకు ముప్పు తప్పదని ఆందోళన్న చెందుతున్న అమెరికా.. అత్యాధునిక ఆయుధాల్ని సమకూర్చుకోవడంపై ఫోకస్ చేసింది. చాలా ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా కాలిఫోర్నియాలో స్టెల్త్ బాంబర్ విమానాన్ని తయారు చేసింది. ఆయుధాల తయారీలో దిగ్గజంగా పేరున్న నార్తాప్ గ్రూప్ దీన్ని అభివృద్ధి చేసింది. నింగిలోని ఉపగ్రహాల కంటపడకుండా ఉండేందుకు స్టెల్త్ బాంబర్ను హ్యాంగర్ నుంచి మొన్నటిదాకా బయటకు తీసుకురాలేదు. అంతా ఓకే అనుకున్నాక ప్రపంచం ముందు ప్రదర్శించింది.
ఎవరికీ చిక్కకుండా.. దొరక్కుండా చుక్కలు చూపించడమే స్టెల్త్ బాంబర్ స్పెషాలిటీ. ప్రస్తుతానికి వర్చువల్ శాంపిల్ను ఉపయోగించి దీని సామర్థ్యంపై పరీక్షలు చేస్తున్నారు. వచ్చే ఏడాది బి-21 రైడర్ తొలిసారిగా ఆకాశంలోకి ఎగిరే అవకాశముంది. గంటకు 900 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. బాంబ్ షేప్లో అత్యంత శక్తిమంతమైన సెన్సర్లు ఉన్నాయి. అవి శత్రువుల గురించి నిరంతరం డేటాను అందిస్తుంటాయి. అందుకే ఈ యుద్ధవిమానం.. దాడులకే కాకుండా నిఘా సమాచార సేకరణకు సైతం ఉపయోగపడుతుంది. శత్రు దాడుల్ని బి-21 చాలా సమర్థంగా ఎదుర్కోగలదని.. అవసరమైతే దీన్ని పైలట్ లేకుండా నడపొచ్చని నిపుణులు చెప్తున్నారు. శత్రువుకు మస్కా కొట్టడంలో స్టెల్త్ బాంబర్ స్టైలే వేరు. బి-21 విమానం మొత్తం ఒక రెక్క ఆకారంలో ఉంది. దాని ఇంజిన్లు, ఆయుధాలను అంతర్గతంగా అమర్చారు. ఈ లోహవిహంగానికి ప్రత్యేక పూత వేశారు. రైడర్ నుంచి వెలువడే ఎలక్ట్రానిక్ సంకేతాలు కూడా కొంత ప్రాంతానికే పరిమితమవుతాయి. అందుకే శత్రువుకు అంత ఈజీగా ఆచూకీ దొరకదు. ప్రత్యర్థి రాడార్ తెరలపై ఇది యుద్ధవిమానంలా కాకుండా మరేదో వస్తువులా కనిపిస్తుంది. తమ దేశంలోకి యుద్ధ విమానాలు చొరబడకుండా చూసేందుకు శత్రువు మోహరించే యాంటీ యాక్సెస్, ఏరియా డినైల్ ఆయుధ వ్యవస్థల్ని బి-21 బోల్తా కొట్టించగలదు. రష్యా ఎస్-400 క్షిపణి వ్యవస్థ, చైనా జె-20 స్టెల్త్ యుద్ధవిమాన దాడుల్ని కూడా తట్టుకొనేలా రైడర్ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అలాగే ఇది ఎలక్ట్రానిక్ దాడుల్ని కూడా చేయగలుగుతుంది. అందుకే దీన్ని అమెరికా చేతిలో బ్రహ్మాస్త్రంగా అభివర్ణిస్తున్నారు. ఒక్కో బాంబర్ తయారీ కోసం 16 వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తోంది అమెరికా ప్రభుత్వం. ఇలాంటి వంద బాంబర్లను సమకూర్చుకోవాలని ప్లాన్ చేస్తోంది.
బి-21ను వాడుకుని మూలన పడేయడమే కాకుండా.. దాని సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయొచ్చు. బాంబర్ డిజైన్, తయారీ, నిర్వహణకు సరికొత్త టెక్నాలజీ ఉపయోగించారు. డిజిటల్ ఇంజినీరింగ్, మెరుగైన సాఫ్ట్వేర్, ఓపెన్ ఆర్కిటెక్చర్ ఈ యుద్ధవిమానం సొంతం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ లోహవిహంగాన్ని సులువుగా అప్డేట్ చేస్కోవచ్చు. ఇందులో క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, సెన్సర్లు, ఆయుధాల్ని అత్యాధునిక టెక్నాలజీతో అటాచ్ చేశారు. స్మార్ట్ ఫోన్ల టైప్లో దీని సాఫ్ట్వేర్లను అప్గ్రేడ్ చేసి కొత్త ఆయుధ వ్యవస్థల్ని యాడ్ చేయొచ్చు. ఇన్ని స్పెషాలిటీస్ ఉండట వల్లే బి-21ను తొలి డిజిటల్ బాంబర్గా చెప్పుకుంటున్నారు.
గతంలోని బి-2 బాంబర్ కన్నా బి-21 ఆకృతి చిన్నగా ఉంది. ఈ యుద్ధవిమానం ఒకేసారి ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఇలా తయారు చేశారు. 2001 అక్టోబరులో అఫ్గానిస్థాన్పై దాడుల కోసం బి-2 యుద్ధ విమానాల పైలట్లు నిరంతరాయంగా 44 గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చింది. చాలా పెద్దగా ఉండే ఈ బాంబర్లు పట్టే హ్యాంగర్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలో ఉండటంతో.. వాటిని ఎక్కడా నిలిపే ఛాన్స్ లేకుండాపోయింది. దీనికితోడు ఈ బాంబర్ల విండోలు తెరుచుకునే వీల్లేదు. కాబట్టి హ్యాంగర్లలో ఏసీ వ్యవస్థ తప్పనిసరి. లేకుంటే వేడి వల్ల కాక్పిట్లోని ఎలక్ట్రానిక్ సాధనాలు దెబ్బతినే ప్రమాదముంది. అలాగే.. బి-21 పేరుకు కూడా ఓ స్పెషాలిటీ ఉంది. పెర్ల్ హార్బర్ దాడికి ప్రతిగా 1942లో జపాన్ నగరాలపై అమెరికా యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. బి-25 మిచెల్ బాంబర్లలో దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి దాడులు చేశారు. తిరుగుప్రయాణంలో విమానాల్ని వదిలేసి పారాచూట్ల సాయంతో చైనా, సోవియట్ రష్యాలో దిగారు. అక్కడి ప్రజల సాయంతో స్వదేశానికి తిరిగి వెళ్లారు. నాటి దాడులకు గుర్తుగా బి-21కు రైడర్ అని నామకరణం చేసింది అమెరికా. మొత్తానికి తిరుగులేని బలంతో.. ఎన్నో ప్రత్యేకతలున్న స్టెల్త్ బాంబర్ అమ్ముల పొదిలో చేరడంతో పెద్దన్న బలం మరింత పెరిగింది. మరి.. ఈ నయా బాంబర్ను ఎదుర్కోవడానికి చైనా ఎలాంటి ఆయుధాన్ని తయారు చేస్తుందో చూడాలి.