ఇస్లామాబాద్‌లో తొలి హిందూ దేవాలయానికి శంకుస్థాపన

  • Published By: bheemraj ,Published On : June 24, 2020 / 09:58 PM IST
ఇస్లామాబాద్‌లో తొలి హిందూ దేవాలయానికి శంకుస్థాపన

పాకిస్థాన్ రాజ‌ధాని ఇస్లామాబాద్‌లో తొలిసారి హిందూ దేవాల‌యాన్ని నిర్మించ‌నున్నారు.  రూ.10 కోట్ల ఖ‌ర్చుతో ఆల‌య నిర్మాణం జరుగనుంది. ఇస్లామాబాద్‌లో తొలి హిందూ దేవాలయానికి పునాది రాయి పడింది. రాజ‌ధానిలోని హెచ్‌-9 ప్రాంతంలో సుమారు 20 వేల చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లంలో  శ్రీ కృష్ణ మందిర్ ఆల‌య నిర్మాణం కోసం మంగళవారం శంకుస్థాప‌న చేశారు. పాక్ పార్ల‌మెంట‌రీ కార్య‌ద‌ర్శి లాల్ చంద్ మ‌ల్హీ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఆయన చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. 

ఈ సందర్భంగా లాల్‌చంద్‌ మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా ఇస్లామాబాద్‌లో హిందువుల జనాభా పెరుగుతుందని, కాబట్టి వీరి కోసం ఓ ఆలయం అవసరమని చెప్పారు. ఇస్లామాబాద్‌లో 1947కు ముందు క‌ట్టిన అనేక హిందూ ఆల‌యాలు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అయితే ఆ పురాత‌న ఆల‌యాల‌ను ప్ర‌స్తుతం వాడ‌డం లేద‌న్నారు. ఆల‌య నిర్మాణం కోసం కావాల్సిన ఖ‌ర్చును ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని మ‌త వ్య‌వ‌హారాల శాఖా మంత్రి పీర్ నూరుల్ హ‌క్ ఖాద్రి తెలిపారు. 

ప్ర‌స్తుతం ప‌ది కోట్ల టార్గెట్‌తో ఆల‌య నిర్మాణం మొద‌లుపెట్టామ‌న్నారు. ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అనుమ‌తితోనే ఆల‌య నిర్మాణం ప్రారంభించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఇస్లామాబాద్‌లో ఉన్న హిందూ పంచాయ‌త్.. కొత్త ఆల‌యానికి శ్రీ కృష్ణ మందిర్ అని పేరు పెట్టింది. ఆల‌యం నిర్మిస్తున్న స్థ‌లాన్ని క్యాపిట‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ .. 2017లో హిందూ పంచాయ‌త్‌కు అప్ప‌గించింది. ఆల‌యం స‌మీపంలో హిందూ శ్మ‌శాన‌వాటిక‌ను కూడా నిర్మించ‌నున్నారు.