గూగుల్కి రూ. 1,180 కోట్లు జరిమానా
రూల్స్ పాటించకపోతే ఎంతటి వాడికైనా దెబ్బ తప్పదు అని ఫ్రాన్స్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ రోజుల్లో దేని గురించి తెలుసుకోవాలి అన్నా గూగుల్ని ఆశ్రయిస్తాం కదా? ఆ గూగుల్కే జరిమానా విధించింది ఫ్రాన్స్ ప్రభుత్వం. జనరల్ డేటా ప్రొటెక్షన్ రేగులేషన్(GDPR) రూల్స్ పాటించని కారణంగా ఫ్రాన్స్ ప్రభుత్వం గూగుల్కు ఏకంగా రూ. 1,180 కోట్లు జరిమానా విధించింది.
ఆన్లైన్, వాణిజ్య ప్రకటనల మార్కెట్లో గూగుల్ సంస్థ ప్రదర్శిస్తున్న ఆధిపత్య ధోరణిపై మండిపడిన ఫ్రాన్స్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్లో వాణిజ్య ప్రకటనల్ని ఆమోదించడానికి అనుసరించే విధానాలు ఏ మాత్రం పారదర్శకంగా లేవని వెల్లడిస్తూ జరిమానా విధించింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో యాడ్స్ ఇచ్చే వారందరికీ ఒకే నియమ నిబంధనలు ఉండాలని స్పష్టం చేస్తూ ఫ్రాన్స్ జరిమానాలు విధించింది.
అంతేకాదు ప్రకటనలకు తదితర వాటికి గూగుల్ యూజర్ల వ్యక్తిగత డేటాను వాడుకుంటోంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. యూజర్ల అనుమతి లేకుండా వారి డేటా వాడకూడదు అనేది ఫ్రాన్స్ ప్రభుత్వ పాలసీ. కానీ గూగుల్ యూజర్ల అనుమతి లేకుండా యూజర్ల డేటా వాడుకున్నందుకు ఈ జరిమానా సరైనదేనని భావిస్తుంది ఆ దేశం.