Emmanuel Macron : ఫ్రాన్స్ అధ్యక్షుడి వార్నింగ్.. కోవిడ్ వ్యాక్సిన్ కోసం క్యూ కట్టిన జనం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ చేసిన హెచ్చరికలతో ఆ దేశంలో మంగళవారం రికార్డుస్థాయిలో ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకున్నారు
Emmanuel Macron ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ చేసిన హెచ్చరికలతో ఆ దేశంలో మంగళవారం రికార్డుస్థాయిలో ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకున్నారు. ఒక్క రోజే 13 లక్షల మంది తమ తొలి డోసు వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. వాస్తవానికి ఫ్రాన్స్లో ప రోజువారీ వ్యాక్సినేషన్ సగటు 5.7లక్షల డోసులు మాత్రమే. ఫ్రాన్స్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన గతేడాది డిసెంబర్ నుంచి ఈ స్థాయిలో వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ముందుకురావడం ఇదే మొదటి సారి అని అక్కడి అధికారులు చెబుతున్నారు. మంగళవారం వ్యాక్సిన్ కోసం కొత్తగా అపాయింట్మెంట్ లు తీసుకున్నవారిలో 35ఏళ్ల వయస్సు లోపు వారే ఎక్కువ ఉన్నట్లు తెలిపారు.
అధ్యక్షుడు ఇచ్చిన వార్నింగ్ ఏంటీ
ఫ్రాన్స్లో కరోనా కారణంగా కొంతకాలం పాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. గత నెలలోనే ఆంక్షలు సడలించి అన్ని కార్యకలాపాలకు అనుమతులిచ్చారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు డెల్టా వేరియంట్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలను ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. వీలైనంత త్వరగా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతోంది. కానీ, ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రమే వస్తుండటంతో సోమవారం రాత్రి ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ ప్రజలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
ఆగస్టు నుంచి రెస్టారెంట్లు, షాపింగ్మాల్స్, బార్లకు వెళ్లాలన్నా మరియు రైళ్లు,విమానాల్లో ప్రయాణించాలన్నా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇచ్చే ప్రత్యేక కోవిడ్ -19 పాస్ లు తప్పనిసరిగా చూపించాల్సిందేనని మెక్రాన్ స్పష్టం చేశారు. అధ్యక్షుడి తాజా హెచ్చరిక నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతం అవుతుందని అధికార యంత్రాంగం ఆశిస్తోంది. మొత్తంగా ఇప్పటివరకు ఫ్రాన్స్లో 41శాతం మంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారని స్థానిక అధికారులు తెలిపారు.