Corona Vaccine : టీకా తీసుకోకపోతే అరెస్ట్, పందులకిచ్చే ఔషధమిస్తాం… దేశ ప్రజలకు అధ్యక్షుడి హెచ్చరిక
కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ అని నిపుణులు తేల్చారు. ప్రజలందరికి టీకాలు ఇస్తేనే మహమ్మారిని అంతం చేయగలం అని చెప్పారు.
Corona Vaccine : కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ అని నిపుణులు తేల్చారు. ప్రజలందరికి టీకాలు ఇస్తేనే మహమ్మారిని అంతం చేయగలం అని చెప్పారు. ఈ క్రమంలో ప్రపంచంలోని అన్ని దేశాలు తమ ప్రజలకు వ్యాక్సిన్లు ఇస్తున్నారు. పెద్దఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాయి. అయితే కొన్ని దేశాల్లో ప్రజలు టీకాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో అక్కడి ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి.
టీకా తీసుకోవడానికి నిరాకరిస్తున్న వారికి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. లేదంటే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అయినా టీకా వద్దనుకుంటే భారత్ లేదా అమెరికాలో ఏదో ఒక చోటికి వెళ్లాలని అన్నారు.
తాను తీసుకుంటున్న నిర్ణయం ఎవరికీ నచ్చదని.. కానీ, కరోనా వల్ల ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో కఠిన నిబంధనలు తప్పవని స్పష్టం చేశారు. టీకా తీసుకోని వారు వైరస్ వ్యాప్తి చేస్తూనే ఉంటారని తెలిపారు. అలాంటి వారి వల్ల దేశానికే ప్రమాదం అన్నారు.
అందువల్లే ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. లేదంటే పందులకు ఇచ్చే ఐవర్మెక్టిన్ ఔషధం ఇస్తామని హెచ్చరించారు. అప్పుడు వైరస్తో పాటు మీరూ చనిపోతారని వ్యాఖ్యానించారు. మహమ్మారి వల్ల గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆగ్నేయాసియా దేశాల్లో ఫిలిప్పీన్స్ కూడా ఒకటి. బుధవారం అక్కడ 4,353 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు ఫిలిప్పీన్స్లో 1,372,232 కేసులు నిర్ధారణ అయ్యాయి.