10వేలు దాటిన కరోనా మృతులు…అలాగే జరిగితే భారత్ లో 30కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం
వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య పది వేలు దాటింది. అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఈ విషయాన్ని చెప్పింది. గత ఏడాది డిసెంబర్ లో కరోనా ప్రబలిన నాటి నుంచి హాప్కిన్స్ వర్సిటీ మరణాల సంఖ్యను నమోదు చేస్తోంది. 182దేశాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు సోకిన ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 10వేల64కరోనా మరణాలు నమోదైనట్లు తెలిపింది.
అయితే ఈ వైరస్ సోకిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల 50 వేలకు చేరుకుంటోంది. అయితే కరోనా మరణాలు వైరస్ మొదట పుట్టిన చైనా కంటే ఇటలీలోనే ఎక్కువగా నమోదయ్యాయి. ఇటలీలో నిన్న ఒక్క రోజే 427 మంది మరణించారు.ఇరాన్ లో పరిస్థితి తీవ్రంగానే ఉంది. అగ్రరాజ్యం అమెరికా కూడా షట్ డౌన్ అయింది.
మరోవైపు భారత్లో కరోనా కేసులు సునామీలా విరుచుకుపడే అవకాశాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ డైరక్టర్ డాక్టర్ రమణన్ లక్ష్మీనారయణ తెలిపారు. త్వరలోనే ఈ పరిస్థితి ఇండియాలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. బ్రిటన్, అమెరికా తరహాలో ఇండియాలో వైరస్ వ్యాప్తి చెందితే.. ఇక్కడ సుమారు 30 కోట్ల కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని, దాంట్లో సుమారు 50 లక్షల కేసులు సీవియర్గా ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు.
కానీ భారత్ ఇప్పటికే వైరస్ కట్టడి కోసం అనేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి భారత్లో 200 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా,ఐదు కరోనా మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇండియ కూడా దాదాపు షట్ డౌన్ అయింది. ప్రత్యేక రైలు సర్వీసులను,అంతర్జాతీయ విమానాల రాకపోకలను రద్దు చేసింది భారత ప్రభుత్వం. అంతేకాకుండా సరిహద్దులు కూడా మూసివేసింది.(కరోనా భయం: పదోతరగతి పరీక్షలు వాయిదా)