మంచి దొంగలు : దోచుకున్న సొమ్మంతా తిరిగి ఇచ్చేశారు
దొంగలు మనుషుల్ని బెదిరించి దోచుకెళ్తుంటారు. దయ, జాలి, కనికరం ఏమీ ఉండవు. వినకపోతే చితగ్గొడుతారు. అడ్డొస్తే చంపి విలువైన వస్తువుల్ని దోచుకెళ్తారు. కానీ పాకిస్తాన్లోని కరాచీలో మాత్రం ఇద్దరు దొంగలు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఓ వ్యక్తి దగ్గర దోచుకున్న సొమ్మంతా తిరిగి ఇచ్చేశారు. దాంతోపాటు అతనికి ఓ హగ్ కూడా ఇచ్చి వెళ్లిపోయారు.
వివరాల్లోకి వెళితే.. బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్ను బెదిరించి అతని మనీ పర్స్, ఇతర విలువైన వస్తువులు లాక్కున్నారు. బైక్ పై ఎక్కి అక్కడి నుంచి పరారవ్వాలనుకున్నారు. కానీ అంతలోనే మనసు మార్చుకుని… ఆ డెలివరీ బాయ్కి అతని దగ్గర దోచుకున్న వస్తువులన్నీ తిరిగి ఇచ్చేశారు.
అయితే దొంగల మనసు మారడానికి కారణమేంటో తెలుసా? దొంగలు తన వద్ద నున్న సొమ్ములను తీసుకుంటున్నప్పుడు డెలివరీ బాయ్ నిశ్చేష్టుడయ్యాడు. ఏమీ చేయలేక, వారిపై తిరగబడలేక ఏడుస్తూ ఉండిపోయాడు. దాంతో ఆ దొంగలు వస్తువుల్ని తిరిగి ఇచ్చేశారు. ఇదంతా సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డైంది. నిమిషం నిడివి గల ఈ వీడియో సోషల్ వీడియోలో వైరల్ అయింది.
దొంగల్లో కూడా మానవత్వం దాగుంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘వీళ్లు మామూలు దొంగలు కాదు. మనసు దోచుకున్న మంచి దొంగలు’ అని మరికొందరు పేర్కొన్నారు.
Read: కరోనా వైరస్ ఎంత ప్రాణాంతకమంటే? సైంటిస్టుల సమాధానం వారి మాటల్లోనే..!