ముషారఫ్ శావాన్ని 3రోజులు వేలాడదీయండి…పాక్ కోర్టు

  • Published By: venkaiahnaidu ,Published On : December 19, 2019 / 03:54 PM IST
ముషారఫ్ శావాన్ని 3రోజులు వేలాడదీయండి…పాక్ కోర్టు

రాజద్రోహం కేసులో పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ కు మరణశిక్ష విధిస్తూ మంగళవారం(డిసెంబర్-19,2019)స్పెషల్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే 167పేజీల పూర్తి తీర్పు ప్రకారం…ఏదేని కారణంతో ముషారఫ్‌ మరణించినా ఆయన మృతదేహాన్నైనా ఉరితీయాల్సిందే. అనారోగ్య లేక మరేదైన కారణంతో ముషారఫ్‌ మరణించినా ఆయన శవాన్ని ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్‌లో మూడు రోజులపాటు వేలాడదీయాలని తీర్పులో సృష్టంగా కోర్టు పేర్కొంది. ఈ మేరకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక 2016లో దుబాయ్‌కి పారిపోయిన ముషారఫ్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. 

రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మంగళవారం ముషారఫ్‌కు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్‌ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణకు పెషావర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వకార్‌​ అహ్మద్‌ సేథ్‌ నేతృత్వం వహించగా జస్టిస్‌ కరీం, జస్టిస్‌ నజారుల్లా అక్బర్‌ సభ్యులుగా ఉన్నారు. జస్టిస్‌ వకార్‌​ అహ్మద్‌,  జస్టిస్‌ కరీం ముషారఫ్‌ ఉరిశిక్షకు అనుకూలంగా ఓటు వేయగా.. జస్టిస్‌ నజారుల్లా వ్యతిరేకంగా ఓటు వేశారు.