కోట్లలో జీతం వచ్చే ఉద్యోగి…శాండ్ విచ్ లు దొంగతనం చేసి దొరికిపోయాడు
ఆయనో పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సంవత్సరానికి కోట్లలో జీతం. అయినా చిల్లర అలవాట్లు మానుకోలేకపోయాడు. కక్కుర్తి బుద్ధి ఆయన కొంప ముంచింది. చివరకి బంగారం లాంటి ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడాల్సి వచ్చింది. అసలు ఇంతకీ ఏం జరిగందంటే?
యూరప్లో బ్యాంకింగ్ లావాదేవీలతో అత్యధిక లాభాలు గడిస్తున్న ‘సిటీ గ్రూప్’ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్న పరాశ్ షా(31) జీతం బోనస్ లతో కలిపి ఏడాదికి ఒక మిలియన్ యూరోలకు పైనే. అయితే కోట్ల రూపాయల జీతం వస్తున్నప్పటికీ తన చిల్లర బుద్ధితో లండన్లోని కానరీ వార్ఫ్లో ఉన్న బ్యాంక్ ప్రధాన కార్యాలయంలోని స్టాఫ్ క్యాంటీన్ నుంచి తరచుగా ఆహారాన్ని దొంగలిస్తున్నాడు. పలుసార్లు శాండ్విచ్లు దొంగలించారట. ఈ విషయం తెల్సిన యాజమాన్యం ఆగ్రహించి…యూరప్తోపాటు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా బ్యాంకింగ్ కార్యకలాపాలకు కూడా హెడ్ గా వ్యవహరిస్తున్న పరాశ్ షాను గత నెలలో ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. చిల్లర వేశాల కారణంగా బంగారం లాంటి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు పరాశ్ షా.
సీనియర్ ఉద్యోగులకు బ్యాంక్ వార్షిక బోనస్ చెల్లించాల్సి ఉన్న కొన్ని వారాల ముందు పరాశ్ షా సస్పెండ్ అయ్యాడు.పరాశ్ షా సెలవుల్లో వివిధ దేశాల్లో పర్యటించే అలవాటు ఉందని ఆయన ఫేస్బుక్ పేజీలు చూస్తే అర్థం అవుతోంది. ఆయన పెరూలోని ‘మాచు పిచ్చూ’ పర్యాటక కేంద్రాన్ని సందర్శించినట్లు ఆయన ఫొటోలను చూస్తే అర్థం అవుతోంది. లండన్లోని ఎడ్మాంటన్లో గ్రామర్ స్కూల్లో చదవిన షా, బాత్ యూనివర్శిటీలో 2010లో ఎకనామిక్స్లో డిగ్రీ చేశారు. హెచ్ఎస్బీసీలో ఇన్కమ్ ట్రేడింగ్ బిజినెస్లో ఏడేళ్లు పనిచేసి 2017లో సిటీ గ్రూప్లో చేరారు.
గతంలో ఇలానే చాలా మంది
అంత ఉన్నత స్థానంలో ఉన్న ఓ వ్యక్తి శాండ్విచ్ డబ్బుల కోసం కక్కుర్తి పడడం చూసే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇలాగే కక్కుర్తి పడిన పలువురు బ్యాంకర్లు సస్పెండయిన సంఘటనలు గతంలో చాలానే ఉన్నాయి. ఓ ఫ్రెండ్ బైక్ నుంచి 500 రూపాయల విలువచేసే ఓ పార్ట్ను దొంగలించినందుకు ఓ లండన్ బ్యాంకర్ను 2016లో జపాన్కు చెందిన మిజువో బ్యాంక్ ఉద్యోగం నుంచి తొలగించింది. 2014లో బ్లాక్రాక్ ఎగ్జిక్యూటివ్ జోనాథన్ బుర్రోస్ రెగ్యులర్ గా టిక్కెట్టు కొనకుండా రైల్లో తన ప్లేస్ నుంచి లండన్ కు ప్రయాణిస్తూ దొరికి పోయారు. బ్రిటన్ ఆర్థిక రంగంలో ఆయన ఎక్కడా పనిచేయకుండా ‘ఫైనాన్సియల్ కండక్ట్ అథారిటీ’ ఆయనపై నిషేధం విధించింది. ఆయన బ్రిటన్ ఆగ్నేయ రైల్వేకు 39 లక్షల రూపాయలను చెల్లించడం ద్వారా కేసును సర్దుబాటు చేసుకున్న విషయం తెలిసిందే.