కరోనా కన్నా ఆకలి చంపేస్తోంది, లాక్‌డౌన్ దెబ్బకు ఏడాదిలో లక్షా 28వేలకు మించి చిన్నారులు ఆకలితో చనిపోపోవచ్చు

  • Published By: naveen ,Published On : July 28, 2020 / 12:50 PM IST
కరోనా కన్నా ఆకలి చంపేస్తోంది, లాక్‌డౌన్ దెబ్బకు ఏడాదిలో లక్షా 28వేలకు మించి చిన్నారులు ఆకలితో చనిపోపోవచ్చు

ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకలి చావులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. రానున్న రోజుల్లో ఆకలితో మరణించే వారి సంఖ్య మరింత పెరగనుందని, లక్షా 28వేల మంది చిన్నారులను ఆకలి బలి తీసుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. లాక్‌డౌన్‌తో ఉపాధి కరువై తిండి లభించక… వలస కార్మికులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోల్పోయి తల్లడిల్లుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారింది. కుటుంబసభ్యులకు ఒక్క పూట తిండి పెట్టడం కూడా కష్టంగా మారింది.

లాక్ డౌన్ నిబంధనలతో ఆకలి కేకలు:
”కరోనా వైరస్, లాక్ డౌన్ నిబంధనలు పేదలను మరింత ఇబ్బందుల్లో పడేశాయి. ఆకలి, మరో 10వేల మంది చిన్నారులను బలి తీసుకోనుంది. ఆహారం, వైద్య సదుపాయాలు ఆగిపోవడం శాపంగా మారింది” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీనికి తోడు పిల్లల్లో పౌష్టిక ఆహార లోపం పెరుగుతోందని తెలిపింది. బుర్కినాలో ఓ చిన్నారి సరైనా ఆహారం లేక ఇప్పటికే 2.5 కిలోల బరువు తగ్గాడు. కరోనా లాక్ డౌన్ నిబంధనల కారణంగా మార్కెట్లు బంద్ కావడం పౌష్టికాహార లోపానికి దారి తీసింది. పిల్లలే కాదు వారి తల్లిదండ్రులు కూడా అర్దాకలితో అలమటిస్తున్నారని, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ వాపోయింది. కరోనా సంక్షోభం కొన్నేళ్ల పాటు తీవ్రమైన ప్రభావం చూపనుందని, ఆకలి కేకలు, చావులు పెరుగుతాయని నిపుణులు అంచనా వేశారు.

అర్థాకలి, పౌష్టిక ఆహార లోపం:
లాటిన్ అమెరికా నుంచి సౌత్ ఆసియా, సబ్ సహారన్ ఆఫ్రికా వరకు… పేద కుటుంబాలు అర్థాకలితో బాధపడుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా కరువు ఏర్పడుతుందని గతంలోనే హెచ్చరించారు. ఇప్పటికే వెనిజులా దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఆకలితో బాధపడుతున్నారు. ప్రతి రోజు పౌష్టిక ఆహారం లోపంతో ఒక పిల్లాడు తమ ఆసుపత్రిలో చేరుతున్నాడని టచారియాలోని ఓ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. రెండు నెలల క్వారంటైన్ తర్వాత ఇద్దర కవల పిల్లలు ఎముకల గూడుతో బయటకు వచ్చారు. వారు పౌష్టిక ఆహారం లోపంతో బాధపడుతున్నారు. వారి తల్లికి ఉపాధి లేదు. అరటిపండ్లు ఉడకబెట్టి ఆ నీటితో పిల్లల కడుపు నింపినట్టు ఆ తల్లి చెప్పడం కంటతడి పెట్టించింది. వారి దయనీయ స్థితికి ఇది అద్ధం పడుతుంది.

పేదల పాటిల శాపంగా మారిన లాక్ డౌన్ ఆంక్షలు:
ప్రపంచవ్యాప్తంగా పేదల కడుపులు నింపేందుకు తక్షణమే 2.4 బిలియన్ డాలర్లు సాయం చేయాలని దేశాలను డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ తో మరో సంస్థ కోరాయి. అయితే డబ్బు లేకపోవడం అనే సమస్య కన్నా, లాక్ డౌన్ ఆంక్షల కారణంగా చాలామంది పేదలు చికిత్సకు కూడా నోచుకోవడం లేదని గుర్తించారు. స్కూల్స్ మూసివేత, ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సేవలకు ఆటంకటం, పౌష్టిక ఆహారం అందించే కార్యక్రమాలు నిలిచిపోవడం.. ఇవన్నీ పేదల పాలిట శాపంగా మారాయని నిపుణులు వాపోయారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు అవసరమైన విటమిన్ ఏ సప్లిమెంట్స్ సరఫరా నిలిచిపోవడం వల్ల చాలా నష్టం జరుగుతోందన్నారు.

హంగర్ రెడ్ జోన్ లో ఆఫ్ఘనిస్తాన్:
ఆఫ్ఘనిస్తాన్ లో లాక్ డౌన్ ఆంక్షల కారణంగా పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పౌష్టిక ఆహార లోపంతో బాధపడుతున్న తమ పిల్లలను తల్లిదండ్రులు ఆసుపత్రులకు తీసుకెళ్లలేకపోతున్నారు. జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ అంచనా ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ లో 5ఏళ్ల లోపు 13వేల మంది చిన్నారులు ఆకలితో చనిపోతారు. ఆకలి విషయంలో ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ రెడ్ జోన్ లో ఉంది. అక్కడ పిల్లలు తీవ్రమైన పౌష్టిక ఆహార లోపంతో బాధపడుతున్నారు. యూనిసెఫ్ లెక్కల ప్రకారం గతంలో 6లక్షల 90వేలుగా ఉన్న సంఖ్య ఇప్పుడు 7లక్షల 80వేలకు పెరిగింది.

ఆకలి తీర్చుకోవడానికి గడ్డి, మొక్కలు తింటున్నారు:
యెమన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తీవ్రమైన కరువు నెలకొంది. సబ్ సహారన్ ఆఫ్రికాలోనే ఇదే పరిస్థితి ఉంది. సుడాన్ లో 96లక్షల మంది ప్రజలు కేవలం ఒక పూట మాత్రమే తింటున్నారు. ఆహారం లేకపోవడంతో ఆకలి తీర్చుకునేందుకు గడ్డి, మొక్కలు తింటున్నారు. కరోనా సంక్షోభానికి ముందు ప్రజలు మూడు పూటలా తినేవారు. బ్రెడ్, బటర్ తినేవారు. కరోనా తర్వాత కేవలం ఒక పూట మాత్రమే తిండి లభిస్తోంది.