పురువునష్టం కేసులో గెలిచిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య పరువునష్టం కేసులో యూకే కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇమ్రాన్ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్ యూకే హైకోర్టులో వేసిన పరువునష్టం కేసులో విజయం సాధించారు. పాక్ సంతతికి చెందిన బ్రిటీష్ జాతీయురాలు రెహామ్ఖాన్పై 2018 జూన్ నెలలో దునియా టీవీ ‘ఆన్ ది ఫ్రంట్ విత్ కమ్రాన్ షాహిద్’ పేరుతో ఓ కార్యక్రమం ప్రసారం చేసింది. ఈ సందర్భంగా పాకిస్తాన్లోని ప్రస్తుత రైల్వేశాఖ మంత్రి షేక్ రషీద్…రెహమాన్ఖాన్పై తీవ్రమైన తప్పుడు ఆరోపణలు చేశారు.
పాక్ మంత్రి చేసిన ఆరోపణలపై రెహామ్ ఖాన్ పరువుకు భంగం వాటిల్లినందున పాకిస్తాన్ న్యూస్ ఛానల్ క్షమాపణలు చెప్పింది. సోమవారం లండన్లోని హైకోర్టులో జరిగిన విచారణలో జస్టిస్ మాథ్యూ నిక్లిన్ ఈ తీర్పు వెలువరించారు. దునియా టీవీ మా క్లయింట్కి బహిరంగ క్షమాపణ చెప్పిందని జస్టిస్ తెలిపారు.
నా నిజాయితీని నిరూపించుకోవడానికి సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చిందని, ప్రతివాది అయిన దునియా న్యూస్ లిమిటెడ్ ప్రసార సమయంలో చేసిన ఆరోపణల్లో నిజం లేదని తనకు క్షమాపణలు చెప్పడం సంతోషంగా ఉందని కోర్టు ఉత్తర్వులపై రెహామ్ఖాన్ వ్యాఖ్యానించారు. గత సంవత్సరం చేసిన ప్రసారంపై రెహామ్ఖాన్ యూకే మీడియా వాచ్ డాగ్, ఆఫీస్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (ఆఫ్కామ్) కు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ ఫిర్యాదును ఆఫ్కామ్ కూడా సమర్థించింది.