జర్మనీలో దారుణం : భారతీయ జంటపై దాడి, భర్త మృతి

  • Published By: veegamteam ,Published On : March 31, 2019 / 01:47 AM IST
జర్మనీలో దారుణం : భారతీయ జంటపై దాడి, భర్త మృతి

జర్మనీలోని మ్యూనిక్‌ నగరంలో దారుణం జరిగింది. భారతీయ జంటపై దాడి జరిగింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఈ విషయం వెల్లడించారు. ‘భారతీయ జంట ప్రశాంత్, స్మితా బసరుర్‌లపై మ్యూనిక్‌ సిటీలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ప్రశాంత్‌ మృతి చెందారు. స్మితా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు కారణమైన న్యూగినీకి చెందిన వలసదారుడి(33)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి కారణాలు తెలియాల్సి ఉంది’ అని ఆమె ట్విట్టర్‌లో తెలిపారు.

ప్రశాంత్‌ సోదరుడు జర్మనీ వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారని,  బాధితుల ఇద్దరు పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవాలని అక్కడి మన దౌత్యాధికారులను కోరామని సుష్మా వివరించారు. భారతీయ జంటపై దాడి జర్మనీలో కలకలం రేపింది. స్థానికంగా నివాసం ఉంటున్న భారతీయుల్లో ఆందోళన నింపింది. తమ వారి క్షేమంపై బంధువులు టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. జర్మనీలో ఉంటున్న భారతీయులకు గట్టి భద్రత కల్పించాలని కోరుతున్నారు. భారత విదేశాంగా శాఖ సైతం.. జర్మనీ అధికారులను ఇదే కోరింది. సెక్యూరిటీ పెంచాలని విజ్ఞప్తి చేసింది.