అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో ఎవ్వరూ లేరు…వూహాన్ నుంచి భారతీయ దంపతుల వీడియో మెసేజ్

  • Published By: venkaiahnaidu ,Published On : February 17, 2020 / 04:05 PM IST
అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో ఎవ్వరూ లేరు…వూహాన్ నుంచి భారతీయ దంపతుల వీడియో మెసేజ్

కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్ సిటీలో చిక్కుకున్ భారతీయ దంపతులు అక్కడ బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. చైనాలో ఇప్పటికే 1700 మందిని బలి తీసుకొని 26 దేశాలకు విస్తరించిన కరోనాతో భారతీయ దంపతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. తమను భారత్ కు తీసుకెళ్లమని మోడీ సర్కార్ కు మొరపెట్టుకున్నారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆశిష్‌ యాదవ్ వూహాన్ లోని టెక్స్ టైల్స్ యూనివర్సిటీలో అసోషియేట్ ప్రొఫెసర్. ఆయన భార్య నేహా.. PhDస్కాలర్. ఈ నెల ప్రారంభంలో వుహాన్ లోని భారతీయులను తరలించడానికి భారత్ ప్రత్యేకంగా ఎయిరిండియా విమానాలను పంపినప్పటికీ నేహాకు సర్జరీ కారణంగా వారు అప్పుడు రాలేకపోయారు. ఈ నెల మొదటి వారంలో దాదాపు 600 మంది భారతీయులను వుహాన్ నగరం నుంచి భారత్ తీసుకొచ్చారు. 

అయితే ఇప్పుడు అక్కడి పరిస్థితిపై భయపడుతున్న ఆశిష్-నేహా దంపతులు ఇండియాకు తీసుకెళ్లమంటూ భారత ప్రభుత్వానికి వీడియో మెసేజ్ లో మొర పెట్టుకున్నారు. సాధ్యమైనంత త్వరగా ఇండియాకు తీసుకెళ్లమని కోరారు. వుహాన్ నగరం దాదాపు ఎడారిగా ఉంది. దయ్యాల నగరంగా మారింది. ఎవరూ లేరు. నిత్యం వందలాది మంది అమ్మాయిలు, అబ్బాయిలతో కళకళ లాడే యూనివర్సిటీ ఖాళీ అయ్యింది. మా అపార్ట్ మెంట్ లో మేమ తప్ప ఎవరూ లేరు. నిత్యావసర సరుకులు లేవు.

మంచి నీళ్లు కూడా లేవు. నీళ్లు కావాలని అభ్యర్ధిస్తే ఈరోజే కొన్ని నీళ్లు ఇచ్చి పోయారంటూ ఖాళీ బాటిల్స్ ను, ఖాళీగా ఉన్న ఫ్రిజ్ ను వీడియోలో చూపించారు. ఈ వారం తర్వాత వుహాన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక విమానం పంపిస్తామని…అందులో రావాలనుకునే భారతీయులు తమతో టచ్ లో ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ చేసింది.