Suez Canal blockage : సూయజ్ కెనాల్లో చిక్కిన భారతీయ నావికుడు.. క్లియరింగ్కు ఇంకెంత సమయం పడుతుందంటే?
ఇసుక తుపాను ధాటికి రాకాసి గాలుల బీభత్సానికి ఎవర్ గివెన్ నౌక కంట్రోల్ తప్పింది. సూయజ్ కెనాల్ కు అడ్డంగా తిరిగి ఇసుకలో కూరుకుపోయింది. ఈ భారీ నౌకలో మన భారతీయ నావికుడు ఒకరు కూడా చిక్కుకున్నాడు.
Indian Sailor Stuck in Suez Canal : ప్రపంచంలోని అతిపెద్ద కంటైనర్ షిప్లలో ఒకటైన ‘ఎవర్ గివెన్’ అనే 400 మీటర్ల పొడవైన 224,000 టన్నుల నౌక సూయజ్ కెనాల్ లో అడ్డంగా ఇరుక్కుపోయింది. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే జలమార్గాల్లో సూయజ్ కెనాల్ ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ జలమార్గంలో ఎవర్ గివెన్ భారీ నౌక అడ్డంగా చిక్కుకుపోవడంతో నౌకయానానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటుగా రాకపోకలు సాగించే ఇతర నౌకలన్నీ ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. దాంతో సూయజ్ కాలువలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మార్చి 23 నుంచి వందల సంఖ్యలో నౌకలు ఈ కెనాల్ మార్గంలో నిలిచిపోయాయి.
ఇసుక తుపాను ధాటికి రాకాసి గాలుల బీభత్సానికి ఎవర్ గివెన్ నౌక కంట్రోల్ తప్పింది. సూయజ్ కెనాల్ కు అడ్డంగా తిరిగి ఇసుకలో కూరుకుపోయింది. ఈ భారీ నౌకలో మన భారతీయ నావికుడు ఒకరు చిక్కుకున్నాడు. ఎర్ర సముద్రం వైపు వెళ్లే ఓడలో మెరిటైమ్ ఆఫీసర్ అనురాగ్ చౌదరి ప్రయాణిస్తున్నాడు. ఎవర్ గివెన్ నౌకలో ఉన్న ఆయన అక్కడి పరిస్థితి గురించి వివరించాడు. చిక్కుకున్న నౌకను తొలగించడానికి ఇంకెంత సమయం పడుతుందో తెలియదంటున్నాడు.
అనేక అడ్డంకులు ఉన్నాయి.. అంత సులభం కాదు :
నౌకను ఇసుకలో నుంచి నీళ్లలో తేలియాడేలా చేయడం అంత సులభం కాదంటున్నారు. చాలా ఇబ్బందులు, అడ్డంకులు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలు ఏ ఒక్కటి ఫలించలేదన్నారు. ఎందుకంటే ఓడ పరిమాణం చాలా పెద్దదిగా ఉందంటున్నారు. ఓడ పరిమాణం 400 మీటర్ల పొడవు ఉంటే.. సూయజ్ కాలువ 205 మీటర్ల వెడల్పు మాత్రమే ఉందన్నారు. తాను ప్రయాణిస్తున్న ఓడ సూయజ్ కాలువలో ఒక వారానికి పైగా చిక్కుకుపోయిందని చౌదరి చెప్పారు.
మార్చి 9న బయలుదేరామన్నారు. ఈజిప్టులో ఉన్న డామిట్టా ఓడరేవు నుండి మార్చి 19న బయలుదేరినట్టు తెలిపారు. ఓడ చిక్కుకున్న విధానం గురించి తమకు తెలుసని ఆయన తెలిపారు. కెనాల్ క్లియర్ కావడానికి ఎంత సమయం పడుతుందంటే.. రాబోయే రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు సూయజ్ కెనాల్ అథారిటీ (ఎస్సీఏ) చైర్మన్ ఒసామా రాబీ చెప్పారు.
భారత ప్రభుత్వం నుంచి సహాయం లేదు :
భారత ప్రభుత్వం నుంచి తమకు ఏ విధమైన సహాయం అందిందా అని అడిగితే.. ఇంతవరకు అధికారికంగా ఏమీ తెలియదని చౌదరి స్పష్టం చేశారు. తమ కంపెనీలు స్థానిక ఏజెంట్లతో చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. కానీ, వారు నిస్సహాయంగా ఉన్నారని అన్నారు. కెనాల్ క్లియర్ చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో మాకు తెలియదని ఆయన అన్నారు, ‘ఎవర్ గివెన్’ నీటిపై తేలియాడేలా చేసేందుకు తాము చేయగలిగినదంతా చేస్తున్నానని అన్నారు. ఇప్పటివరకూ ఈ జలమార్గాల్లో ఎంతమంది భారతీయులు చిక్కుకుపోతారనే దానిపై చౌదరి చెప్పలేమన్నారు.