Sania Mirza Retirement: ఇదే నా లాస్ట్ టోర్నమెంట్: రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా
సానియా మీర్జా టెన్నిస్ నుంచి రిటైర్ కాబోతోంది. 2022 సీజన్ తనకు చివరిదని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఓటమి అనంతరం సానియా మీర్జా ఈ విషయాన్ని ప్రకటించింది.
Sania Mirza Retirement Announced at Australia Open: సానియా మీర్జా టెన్నిస్ నుంచి రిటైర్ కాబోతోంది. 2022 సీజన్ తనకు చివరిదని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఓటమి అనంతరం సానియా మీర్జా ఈ విషయాన్ని ప్రకటించింది. టెన్నిస్ క్రీడలో భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేసి క్రీడాకారిణి సానియా. టెన్నిస్ లో ఉవ్వెత్తున ఎగసిన కెరటలాంటి సానియా క్రీడాభిమానులకు షాక్ ఇచ్చింది. తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటించింది. పాక్ క్రికెట్ షోయాబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న సానియా తల్లి అయిన తర్వాత కొంతకాలం క్రీడలకు దూరంగా ఉంది.
2021లో తిరిగి ఆటలో ప్రవేశించింది. తిరిగి పుంజుకుని క్రీడాభిమానులను అలరిస్తుందనుకుంటున్న సమయంలో తాను రిటైర్ అవుతున్నానని ప్రకటించి షాక్ ఇచ్చింది.ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ..‘ఇది నా చివరి సీజన్ అని నేను నిర్ణయించుకున్నాను. నేను ఒక వారం నుంచి ఇందులో ఆడుతున్నాను. నేను మొత్తం సీజన్లో ఆడగలనో లేదో తెలియదు. కానీ, నేను మొత్తం సీజన్లో ఉండాలనుకుంటున్నాను‘ అని వెల్లడించింది.
సానియా, ఉక్రెయిన్ భాగస్వామి నదియా కిచ్నోక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్లో ఓటమిని చవిచూసింది. స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్సెక్-కాజా జువాన్ జోడీ 4-6, 6-7(5)తో గంటా 37 నిమిషాల్లో ఓటమిపాలయ్యారు. అయితే సానియా ప్రస్తుతం అమెరికాకు చెందిన రాజీవ్ రామ్తో కలిసి ఈ గ్రాండ్స్లామ్ మిక్స్డ్ డబుల్స్లో పాల్గొంటుంది.
సానియా మహిళల డబుల్స్లో ఆమె నంబర్వన్ ర్యాంక్కు చేరుకుంది. కెరీర్లో ఆరు గ్రాండ్స్లామ్ టైటిల్స్ సాధించింది. వీటిలో మూడు టైటిల్స్ మహిళల డబుల్స్, మూడు మిక్స్డ్ డబుల్స్లో గెలుచుకుంది. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో, 2012లో ఫ్రెంచ్ ఓపెన్, 2014లో యూఎస్ ఓపెన్. మహిళల డబుల్స్లో 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్, 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్లో ట్రోఫీలు సాధించింది. 2013లో సానియా సింగిల్స్ ఆడటం విరమించుకుని డబుల్స్లో మాత్రమే ఆడుతూవస్తోంది. డబుల్స్ లో కంటే సానియా సింగిల్స్ లోనే రాణించిందనే చెప్పాలి. సానియా చాలా విజయాలు సింగిల్స్ లో సాధించినవే ఎక్కువ.
పాక్ క్రికెటర్ షోయాబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న ఈ భారత క్రీడాకారిణి మాతదేశానికి దాయాదిగా ఉన్న పాక్ కు కోడలైంది. కుమారుడి పుట్టాక రెండేళ్లు టెన్నిస్కు దూరంగా ఉంది. దాదాపు 91 వారాల పాటు డబుల్స్లో సానియా మీర్జా నంబర్వన్గా కొనసాగింది. 2015లో మార్టినా హింగిస్తో జతకట్టి వరుసగా 44 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి ఈవెంట్లలో పతకాల పంట పండించింది.
సానియా మీర్జా తన కొడుకు పుట్టిన తర్వాత 2018లో టెన్నిస్ కోర్టుకు దూరమై..తిరిగి ఆటలో ప్రతిభ కనబరచటానికి తన బరువును 25కిలోలకంటే ఎక్కువే తగ్గించుకుంది. ఆటలో పునరాగమని తరువాత వచ్చి ఉక్రెయిన్కు చెందిన నదియా కిచెనోక్తో కలిసి హోబర్ట్ ఇంటర్నేషనల్లో మహిళల డబుల్స్ టైటిల్ను గెలుచుకుంది. తర్వాత టోక్యో ఒలింపిక్స్ 2020లో కూడా ఆడినా..పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
1986 నవంబరు 15లో మహారాష్ట్రలోని ముంబైలో పుట్టారు. తండ్రి ఇమ్రాన్ మీర్జా బిల్డర్, తల్లి నసీమా ముద్రణ రంగ వ్యాపారంలో పనిచేసేవారు. సానియా పుట్టిన కొంత కాలానికి హైదరాబాద్ కు వారి కుటుంబం తరలివచ్చింది. క్రికెట్ క్రీడాకారుడు గులాం అహ్మద్ కు దూరపు చుట్టం సానియా. పాకిస్థాన్ క్రీడాకారుడు అసిఫ్ ఇక్బాల్ కూడా ఆమెకు దూరపు బంధువే. సానియా తన 6 ఏళ్లనుంచే టెన్నిస్ ఆడటం ప్రారంభించింది. సానియా మొదటి కోచ్ ఆమె తండ్రి కాగా తరువాత రాగర్ అండ్రసన్ వద్ద శిక్షణ తీసుకుంది.
హైదరాబాద్ఃలోని నసర్ స్కూల్ లో చదువుకున్న సానియా సెయింట్ మెరిస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 2008 డిసెంబరు 11న చెన్నైలో ఎం.జి.ఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చి ఇన్సిటిట్యూట్ ఆమెకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ విభాగంలో డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.సానియా టెన్నిస్ లోనే కాదు స్మిమ్మింగ్ లో కూడా చక్కటి ప్రతిభ ఉన్న క్రీడాకారిణి.