Anti Hijab Protests: హిజాబ్ నిరసనలకు తలొగ్గిన ఇరాన్ ప్రభుత్వం.. మొరాలిటీ పోలీసింగ్ వ్యవస్థ రద్దు
హిజాబ్ వద్దంటూ ఇరాన్ మహిళలు 2 నెలలుగా చేస్తోన్న నిరసనలకు అక్కడి ప్రభుత్వం తలొగ్గింది. మొరాలిటీ పోలీసింగ్ వ్యవస్థను రద్దు చేసింది
Anti Hijab Protests: ఇరాన్లోని కఠినమైన మహిళా దుస్తుల కోడ్ను ఉల్లంఘించారనే ఆరోపణలపై అమిని అనే మహిళ అరెస్టు, ఆ తరువాత చనిపోవడంతో రెండు నెలలకుపైగా ఇరాన్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. మహిళలు రోడ్లపైకొచ్చి ఇరాన్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వీరి ఆందోళనలకు ఇరాన్ ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. మొరాలిటీ పోలీసింగ్ వ్యవస్థను రద్దు చేసినట్లు ఆదివారం ప్రకటించింది.
దేశంలోని మహిళా దుస్తుల నియమావళిని (హిజాబ్ ధరించనందుకు) అతిక్రమించినందుకు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అమీని అనే 22ఏళ్ల కుర్షిష్ మూలానికి చెందిన యువతిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల తర్వాతసెప్టెంబర్ 16న ఆమె పోలీసుల కస్టడీలోనే మరణించింది. దీంతో హిజాబ్ ధరించడానికి వ్యతిరేకంగా మహిళలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఆందోళనకారులు హిజాబ్ తల కవచాలను తగులబెట్టారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో మహిళలు అధిక సంఖ్యలో హిజాబ్ ధరించడం పూర్తిగామానేసి నిరసన తెలిపారు. ఈ క్రమంలో మెరాలిటీ పోలీసులు ఆందోళనకారులపై కాల్పులుసైతం జరిపారు. పలువురు మృత్యువాత పడ్డారు. అయినా, ఇరాన్ మహిళలు వెనక్కు తగ్గలేదు. రెండు నెలలుగా నిరసనలతో దేశం అట్టుడుకుతోంది. దీంతో ఎట్టకేలకు మహిళా పోరాటానికి ఇరాన్ ప్రభుత్వం తలవంచింది. మొరాలిటీ పోలీసింగ్ వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయించింది. మెరాలిటీ పోలీసింగ్ కు న్యాయవ్యవస్థతో సంబంధం లేదని, అందుకే రద్దు చేస్తున్నామని అటార్నీ జనరల్ మొహ్మద్ జాఫర్ మొంటాజెరి ప్రకటించారు.
Anti-Hijab Protests: హిజాబ్కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు.. ఇరాన్లో 75 మంది మృతి
ఇరాన్లో షిరియా చట్టం ప్రకారం.. ఏడేళ్లు దాటిన బాలికలు, మహిళలు తప్పనిసరిగా దుస్తుల నియమావళిని పాటించాలి. అంతేకాకుండా జుట్టును పూర్తిగా కప్పింఉంచేలా హిజాబ్ ధరించాలి. ఈ చట్టం కఠినంగా అమలు జరిపేందుకు 2005లో అక్కడి ప్రభుత్వం మొరాలిటీ పోలీసింగ్ విభాగాన్ని నియమించింది. ఈ పోలీస్ విభాగం హిజాబ్ ధరించని వారిపై చర్యలు తీసుకుంటారు. అవసరమైతే అరెస్టు చేస్తారు. అయితే, మొరాలిటీ పోలీసింగ్ విభాగం ఆగడాలు రోజురోజుకు శృతిమించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమైంది. ఈ క్రమంలో అమినీ మరణంతో నిరసనలు మిన్నంటాయి. రెండు నెలలుగా దేశం అట్టుడికిపోవటంతో ఎట్టకేలకు ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మొరాలిటీ పోలీసింగ్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.