తండ్రికి తగ్గ తనయ : లాక్ డౌన్ ఉల్లంఘించి… భర్తతో హాలిడే ట్రిప్ కు ఇవాంకా ట్రంప్

  • Published By: venkaiahnaidu ,Published On : April 17, 2020 / 12:34 PM IST
తండ్రికి తగ్గ తనయ : లాక్ డౌన్ ఉల్లంఘించి… భర్తతో హాలిడే ట్రిప్ కు ఇవాంకా ట్రంప్

అమెరికాలో కరోనా కరాళనృత్యం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విషయంలో అమెరికా స్పందిన తీరు ఆలస్యం ఖరీదు అక్కడ దాదాపు 7లక్షల కరోనా కేసులు,34 వేలకు పైగా మరణాలు నమోదవడం. ఇటువంటి తరుణంలో మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టిందని,తాము పీక్ స్టేజీ దాటిపోయామని,మే-1కంటే ముందే చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను ఎత్తివేస్తామని, అమెరికన్లు తిరిగి యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభించాలంటూ గురువారం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపునిచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. 

అయితే అమెరికాలో పరిస్థితి తీవ్రస్థాయిలో ఉన్న ఈ సమయంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి స్వయానా అధ్యక్షుడి గారాల కూతురు,సలహాదారు ఇవాంకా ట్రంప్ భర్త జరీద్ కుష్నర్ తో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఇవాంక ట్రంప్‌ భర్తతో కలిసి విహార యాత్రకు వెళ్లిన వార్తలు బయటకు రావడంతో ట్రంప్‌ కుటుంబంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలందరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసిన ఇవాంక.. తానే వాటిని ఉల్లంఘించారంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మహమ్మారిని తేలికగా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఇవాంక, తన భర్త జారేద్‌ కుష్నర్‌తో కలిసి జ్యూయిష్‌ హాలిడే(యూదుల పండుగ- పాసోవర్‌ సెలబ్రేషన్స్‌) కోసం న్యూజెర్సీకి వెళ్లారు. ఏప్రిల్‌ 8న ప్రారంభమైన పాసోవర్‌ సెలబ్రేషన్స్‌ కోసం వాషింగ్టన్‌ డీసీలోని తన నివాసం వీడి గురువారం వరకు అక్కడే ఉన్నారు. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక మెదటగా ప్రచురించింది. ఆతర్వాత పలు వార్తా పత్రికల్లో ఈ విషయం ప్రచురితమైన తర్వాత వైట్ హౌస్ దీనిపై స్పందించింది. ఇవాంక ట్రంప్ న్యూజెర్సీలోని బెడ్‌మినిస్టర్‌ లో ఉన్న ట్రంప్‌ కుటుంబానికి చెందిన గోల్ఫ్‌ రిసార్టుకు భర్తతో కలిసి వెళ్లారని శ్వేతసౌధ వర్గాలు ధ్రువీకరించాయి. ఆమెతో పాటు కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారని, ఇవాంక నివాసం కంటే అక్కడే తక్కువ జనాభా ఉంటారు కాబట్టి పెద్దగా హైరానా పడాల్సిన అవసరం లేదని తెలిపారు. బెడ్‌మినిస్టర్‌లో ఇవాంక భౌతిక దూరం పాటిస్తూనే ఉన్నారు. అక్కడి నుంచే తన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె ప్రయాణం వ్యాపార సంబంధమైనది కాదు. తన కుటుంబంతో వ్యక్తిగతంగా సమయాన్ని గడిపేందుకు వెళ్లారు అని ఓ ప్రకటనలో వైట్ హౌస్ తెలిపింది.

కరోనా వైరస్‌ విస్తరిస్తున్న తొలినాళ్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ అందరూ ఇంట్లోనే ఉండాలంటూ ఇవాంక ఓ వీడియో సందేశం పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మనమంతా తెలిసోతెలియకో కోవిడ్‌ వ్యాప్తిలో భాగస్వాములం అవుతాం. భౌతిక దూరం ఒక్కటే మన ప్రాణాలు కాపాడుతుందని ఇవాంక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇవాంకపై విమర్శల వర్షం కురుస్తోంది. తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి అమెరికన్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా న్యూజెర్సీ, న్యూయార్క్‌లో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఒక్క న్యూయార్క్‌లోనే ఇప్పటి వరకు 16,106 కరోనా మరణాలు,2లక్షల 26వేల 198 కేసులు నమోదవగా,న్యూజెర్సీలో 75వేల 317కేసులు,3వేల518మరణాలు సంభవించాయి. 

Also Read | లాక్ డౌన్ ఉల్లంఘించిన యువకులు…వెరైటీ శిక్ష విధించిన మధ్యప్రదేశ్ పోలీస్