కాల్పుల కలకలం : అమెరికా క్యాపిటల్ భవనం దగ్గర ఉద్రిక్తత
Joe Biden brands violence insurrection : అమెరికా క్యాపిటల్ భవనం దగ్గర ఉద్రికత్త చోటుచేసుకుంది. క్యాపిటల్ భవనంలోకి డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దూసుకొచ్చారు. జోబైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ భేటీ జరిగింది. ఈ భేటీ సమయంలో బైడెన్ ఎన్నికలను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు.
ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ను పోలీసులు ప్రయోగించారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు యత్నించారు. అయినప్పటికీ ఉద్రికత్త పరిస్థితులకు దారితీయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక మహిళ మృతిచెందింది.
కాల్పుల ఘటనతో బైడెన్ గెలుపు ధ్రువీకరణ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. వాషింగ్టన్ నగరాన్ని పోలీసుల అధీనంలోకి తీసుకున్నారు. భారీగా భద్రతా దళాలను మోహరించారు. శాంతియుతంగా నిరసన తెలపాలని ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రంప్ నవంబర్ ఎన్నికల్లో డెమొక్రాట్ జో బిడెన్ చేతిలో ఓడిపోయారు. అయితే తన ఓటమిని అంగీకరించడానికి ట్రంప్ నిరాకరించారు. తన విజయాన్ని అడ్డుకునేందుకు భారీగా ఓటింగ్ మోసం జరిగిందంటూ తన మద్దతుదారులను రెచ్చగొట్టారు. దాంతో ఆందోళనకారులంతా క్యాపిటల్ భవనంలోకి దూసుకొచ్చారు. ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించగా ఒకరు మృతిచెందినట్టు పోలీసులు ధ్రువీకరించారు.