జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయితే మనకేంటి?
ఎవరి నోట విన్నా.. ఏ ఛానెల్ చూసినా అంతటా అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించే. మొత్తానికి అగ్రరాజ్యానికి కొత్త అధ్యక్షుడొచ్చాడు. అయితే మనకేంటి.. అమెరికాలో అధ్యక్షుడు మారితే.. భారతీయులకు ఏం లాభం అనేది ఓ సామాన్యుడి ప్రశ్న.
అయితే అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల ప్రభావం కచ్చితంగా భారతీయుల పడుతుంది. అదెలా అంటే.. అమెరికా-భారత్ ల సంబంధాలపై బైడెన్ ప్రభావం ఎలా ఉండబోతోందనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ హయాంలో ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి. మరి బైడెన్ ప్రభుత్వం వీటి విషయంలో ఎలా వ్యవహరిస్తుంది అనేది అందిరినీ ఆలోచింపచేస్తున్న విషయం.
ఇండియా వైపు నుంచి చూస్తే… విదేశాంగ విధానాల్లో జోబైడెన్కు భారత్గానీ… భారత్కు బైడెన్గానీ కొత్తేమీ కాదు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ 2016లో అమెరికాలో పర్యటించినప్పుడు బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇద్దరికీ ఇప్పటికే పరిచయం ఉంది. అంతేకాదు భారత్తో అమెరికా అనుబంధం గతంలో లాగా కాదు.. ఇప్పడు మరింత వ్యవస్థీకృతమైంది. దాన్ని బలహీనపర్చటం ఈజీ కాదు.
ఎందుకంటే.. చాలా అంశాల్లో అమెరికాకు ఇండియాతో సన్నిహిత్యం అవసరం. భారత్ అండ లేకుండా అగ్రరాజ్యంగా నిలవడం అమెరికాకు సాధ్యం కాని పని. పైగా… బైడెన్ కూడా తన ఎన్నికల ప్రచారంలో అమెరికాలో ఉండే భారతీయులకు దగ్గరయ్యారు. భారత్తో స్నేహసంబంధాలకు బైడెన్ ప్రభుత్వం పెద్దపీటే వేయాల్సిన పరిస్థితి ఉందని బైడెన్ సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానించటం గమనార్హం.
ఇంకో విషయం ఏంటంటే.. భారత్ విషయంలో అధ్యక్షుడు బైడెన్తో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా చాలా కీలకం! ఎందుకంటే… బైడెన్ తన వయసు కారణంగా.. నాలుగేళ్ళు మాత్రమే పదవిలో ఉంటానన్నారు. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కమలా హారిసే. కాబట్టి… చాలా అంశాల్లో ఆమె పాత్ర కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇక భారత్తో రక్షణ, వ్యూహాత్మక సంబంధాల, వాణిజ్యబంధం విషయానికొస్తే.. బహుశా గత రెండు దశాబ్దాలకాలంగా కొనసాగుతున్నట్లే ఇకపై కూడా కొనసాగుతాయని అంచనా. భారత విదేశాంగ నీతిలో అత్యంత కీలకమైన ఇండో-పసిఫిక్ వ్యూహంపై బైడెన్ వర్గం ఇంకా తమ అభిప్రాయాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. ఇకపోతే.. చైనాతో అమెరికా సంబంధాలు బైడెన్ హయాంలో ఎలా ఉంటాయనేదీ భారత్ కు ముఖ్యమైన అంశం.
ట్రంప్లాగా చైనాతో ప్రతిదానికీ గిల్లికజ్జాలు పెట్టుకుంటాడో.. వ్యవహరిస్తాడో దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. అంతర్జాతీయంగా పెద్దన్న పాత్రను తిరిగి పోషించాలనుకుంటున్న అమెరికా కచ్చితంగా చైనాతో పోటీపడుతుందన్నది వాస్తవం. ఈ క్రమంలో అమెరికాకు ఇండియా సాయం తప్పకుండా అవసరం.
మానవ హక్కుల ఉల్లంఘన మాత్రం రెండు దేశాల మధ్య కాసింత ఘర్షణాత్మక అంశం అయ్యే అవకాశాలున్నాయి. జమ్మూకశ్మీర్లో 370 అధికరణ రద్దును డెమొక్రాట్లు ముఖ్యంగా కమలాహారిస్ వ్యతిరేకించారు. ఈ విషయంలో మాత్రం మోడీ ప్రభుత్వానికి కాసింత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. హెచ్-1 బి వీసాలు మంజూరుకు హామీలిచ్చినప్పటికీ వెంటనే ఉదారతను చూపిస్తారనుకోవడం పొరబాటే.