అమెరికాతో పోరాటానికి : ప్రమాదకరమైన పర్వతంపై కిమ్ గుర్రపు స్వారీ
కొత్త ఆపరేషన్ కు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెడీ అయినట్లు బుధవారం(అక్టోబర్-16,2019) కొరియన్ వార్తాసంస్త తెలిపింది. ఉత్తర కొరియా దేశంపై యుఎస్ నేతృతంలోని దేశాలు విధించిన ఆంక్షలపై ఆయన ఫైట్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది.అణు చర్చలపై యుఎస్ మూమెంట్ కి తనకు తానుగా విధించుకున్న స్వంత గడువు సమీపిస్తున్నందున కిమ్ ముఖ్యమైన నిర్ణయాలను ముందే ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కొరియాలోని అత్యంత ప్రమాదకర పర్వతమైన ‘మౌంట్ పయేక్టు’లో కిమ్ సాహోసోపేతమైన గుర్రపు స్వారీ చేశారు. మంచుతో కప్పబడిన పయేక్టు ప్రాంతంలో కిమ్ తెల్లటి గుర్రంపై షికారు చేసిన ఫోటోలను కొరియా ప్రభుత్వం విడుదల చేసింది. కిమ్ వంశస్తులు ఈ పర్వతాన్ని ఎంతో ఆధ్యాత్మికమైన ప్రదేశంగా చూస్తారు. ప్రమాదకరమైన పర్వతంగా పేరు పొందిన పయేక్టులో కిమ్ ధైర్యంగా గుర్రపు స్వారీనీ ఆస్వాదించినట్లు ఆయన సహాయకులు తెలిపారు. ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కిమ్ ఇలాంటి సాహసయాత్రలు చేస్తారని తెలిపారు.
2013 చాలా పవర్ పుల్ వ్యక్తి అయిన తన మామను ఉరితీసేముందు, 2018లో సియోల్, వాషింగ్టన్లతో దౌత్యానికి సంబంధించినటువంటి ప్రధాన నిర్ణయాలు తీసుకునే ముందు కిమ్ దీనిని సందర్శించారు. 2018లో దక్షిణ కొరియాతో జరిగిన చారిత్రక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు మూన్-జే-ఇన్ను పయేక్టు పర్వత శిఖరానికి తీసుకెళ్లారు.
గతంలో అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షించడానికి ముందు కిమ్ పయేక్టు పర్వతాన్ని సందర్శించారు. మరి ఈసారి కిమ్ దేనిపై ప్రకటన చేస్తారో అనేది తెలియాల్సి ఉంది. ప్రపంచ దేశాలు ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ధైర్యంగా నిలబడాలనే ఉద్దేశంలో అధ్యక్షుడు కిమ్ ఇలాంటి సంకేతాలు ఇచ్చారని అర్థమవుతోంది. ఉత్తర కొరియా దేశంపై యుఎస్ నేతృతంలోని దేశాలు విధించిన ఆంక్షలపై ఆయన ఫైట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.