EU సరిహద్దులు మూసివేత…2వారాలు ఫ్రాన్స్ లాక్ డౌన్
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మంగళవారం(మార్చి-17,2020)నుంచి యూరోపియన్ యూనియన్(EU)సరిహద్దులు ,షెంగ్జన్ జోన్ను మూసివేస్తున్నట్లు సోమవారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ తెలిపారు. మంగళవారం నుంచి 30 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని మాక్రాన్ ప్రకటించారు. అంతేకాకుండా మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రయాణాలపై సైతం 15 రోజుల పాటు తీవ్ర ఆంక్షలు కొనసాగుతాయన్నారు.
ప్రజా సమావేశాలపై నిషేధం విధిస్తున్నట్లు మాక్రాన్ తెలిపారు. స్ట్రీట్ మీటింగ్ లు,ఫ్యామిలీ రీ యూనియన్ వంటి వాటిని అనుమతించబోమన్నారు. ఫ్రాన్స్ ప్రస్తుతం “శానిటరీ వార్”పరిస్థితిలో ఉందని మాక్రాన్ ప్రకటించారు. రెండు వారాల పాటు ఫ్రాన్స్ ను లాక్ డౌన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 162 దేశాలకు విస్తరించింది. లక్షా 82 వేల 547 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. మొత్తం 7,164 మంది మృతిచెందారు. దేశాల వారీగా చైనాలో 3,226, ఇటలీలో 2,158, ఇరాన్లో 853, స్పెయిన్లో 342, ఫ్రాన్స్లో 148, అమెరికాలో 87, దక్షిణ కొరియాలో 81, యూకేలో 55, జపాన్లో 27, నెదర్లాండ్స్లో 24 మంది కోవిడ్-19 కారణంగా మృతిచెందారు. భారత్ లో కూడా రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి.