ప్రపంచవ్యాప్తంగా మేడే

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 04:05 AM IST
ప్రపంచవ్యాప్తంగా మేడే

‘మేడే’… అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ప్రపంచం వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది  మే1న మేడే జరుపుకుంటారు. ప్రపంచంలోని కార్మికులంతా జరుపుకుంటారు. అమెరికాలో మాత్రం మేడేను ‘లాయల్టీ డే’గా వ్యవహరిస్తున్నారు. పలు దేశాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావం ఏ ఒక్క దేశం, సంఘటనకో పరిమితం కాదు. కానీ 1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు నాంది పలికింది. ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం ప్రారంభించారు. దీనికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. కానీ ఇది ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 

ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటుచేసుకున్నాయి. 1890, మే 1న బ్రిటన్‌లోని హైడ్ పార్క్‌లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్. ఆ పైన అనేక ఐరోపా దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. ఆపై

ప్రపంచవ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలూ, నిరసన ప్రదర్శనలూ చేపట్టడం పరిపాటైంది. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలోని కొందరు రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. తమ శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయని శ్రామికులు గొంతెత్తారు. ఈ చాకిరీ మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం నినదించి, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్‌ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత జరిగిన అతిపెద్ద మార్పు.

1900 నుంచి 1920 వరకూ యూరప్‌లో ప్రభుత్వ, ధనిక వ్యాపారుల దోపిడీని ఎండగడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే1న నిరసన ప్రదర్శనలు జరిగేవి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మే డే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు. తరవాతి దశకంలో మే 1ని నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు. హిట్లర్ పాలనలో ఆ రోజుని జాతీయ కార్మికుల దినోత్సవంగానూ జరుపుకునేవారు. ఇటలీలో ముసోల్ని, స్పెయిన్‌లో జనరల్ ఫ్రాంకోలు మే డే పైన అనేక ఆంక్షలను విధించారు.

ఇక, 1923లో తొలిసారిగా భారత్‌లో ‘మే డే’ను పాటించారు.. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడటంతో అప్పటి నుంచే కార్మికవర్గాల్లో చైతన్యం మొదలైంది. ఈ చైతన్యంతో ‘మే డే’ను పాటిస్తున్నారు. కానీ అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్‌, లిబరలైజేషన్‌, గ్లోబలైజేషన్‌ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఐరోపా దేశాల్లో మే 1ని సెలవు దినంగా పాటించడం మొదలుపెట్టారు. అనంతరం అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజునే అమల్లోకి వచ్చాయి.