మిస్ యూనివర్శ్- 2019 : కిరీటాన్ని దక్కించుకున్న సౌతాఫ్రికా సుందరి

  • Published By: venkaiahnaidu ,Published On : December 9, 2019 / 03:58 PM IST
మిస్ యూనివర్శ్- 2019 : కిరీటాన్ని దక్కించుకున్న సౌతాఫ్రికా సుందరి

మిస్ యూనివర్స్ 2019 కిరీటాన్ని 26ఏళ్ల దక్షిణాఫ్రికా సుందరి జోజిబిని టుంజీ గెలుచుకుంది. ఆదివారం రాత్రి అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఫైనల్స్ లో టుంజీ విజేతగా నిలిచారు. నేటి తరం యువతకు బోధించాలకునే ముఖ్యమైన అంశం ఏంటని న్యాయ నిర్ణేతలు అడిగిన చివరి ప్రశ్నకు సమయస్ఫూర్తితో సమాధానం చెప్పి అందరి మనసులు గెలుచుకున్నారు టుంజీ. నాయకత్వమే సరైన అంశమని టుంజీ ఇచ్చిన సమాధానంతో సంతృప్తిచెందిన న్యాయ నిర్ణేతలు విశ్వ సుందరి 2019గా ప్రకటించారు.

మిస్ యూనివర్స్ 2018 కాత్రియోనా గ్రే.. జోజిబిని టుంజీకు కిరీటం అలంకరించారు. ప్యూర్టారికో సుందరి మాడిసన్ అండర్సన్ నుంచి గట్టిపోటీ ఎదురైనా చివరికి విశ్వసుందరి కిరీటం టుంజీకనే వరించింది.  తొలి రన్నరప్‌గా ప్యూర్టారికో భామ అండెర్సన్, రెండో రన్నరప్‌గా మెక్సిన్ సుందరి సోఫియా ఆరాగన్ నిలిచారు. మొత్తం 90 దేశాలకు చెందిన యువతులు పాల్గొన్న ఈ పోటీల్లో భారత్‌కు చెందిన వర్తికా సింగ్‌కు టాప్ 20 లోనూ చోటుదక్కలేదు.

విజేతగా ప్రకటించడానికి ముందు టుంజీ మాట్లాడుతూ…నా రంగు, జుట్టును చూసి ఎవరూ అందంగా ఉందని అనరు. అలాంటి ప్రపంచంలో నేను పెరిగాను. ఇక అలాంటి వివక్షకు ముగింపు పలికే సమయం ఇదే అని నేను భావిస్తున్నాని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.  టుంజీ స్వస్థలం దక్షిణాఫ్రికాలోని సోలో. లింగ వివక్ష, హింసకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తున్నారు. లింగ వివక్షపై పోరాటానికి ఆమె సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. మహిళలు తమను తాము ప్రేమించాలని, అందం అంటే సహజంగా ఉండాలని టూజీ తెలిపారు.