Myanmar military firing : మయన్మార్లో రెచ్చిపోయిన సైన్యం : మిలటరీ కాల్పుల్లో 100 మందికి పైగా సామాన్యులు మృతి
మయన్మార్ నెత్తురోడింది. పాలన పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్న సైన్యం.. ఆందోళనకారులను జంతువుల్లా వేటాడుతోంది. సుఖీ నుంచి పాలనను లాక్కున్న సైనిక అధికారులు అప్పటి నుంచి మారణహోం సృష్టిస్తున్నారు.
More than 100 civilians killed : మయన్మార్ నెత్తురోడింది. పాలన పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్న సైన్యం.. ఆందోళనకారులను జంతువుల్లా వేటాడుతోంది. సుఖీ నుంచి పాలనను లాక్కున్న సైనిక అధికారులు అప్పటి నుంచి మారణహోం సృష్టిస్తున్నారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సామాన్యులపై తుపాకీ పంజా మోతున్నారు. ఇవాళ మరోసారి సామాన్యులపై సైనికులు జరిపిన కాల్పుల్లో సుమారు వంద మందికి పైగా చనిపోయారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు అధికారులు. యాంగూన్ సహా దేశంలోని 28 ప్రాంతాల్లో సైన్యం కాల్పులు జరుపగా.. మండాలేలో 29 మంది, యాంగూన్లో 24 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువమంది యువకులే ఉన్నారు. ఫిబ్రవరిలో సైనిక పాలన మొదలైనప్పటి నుంచి బలగాల కాల్పుల్లో సుమారు 5 వందల మందికిపైగా మృతి చెందారు.
క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు వచ్చిన అంబులెన్స్ సిబ్బంది, కవరేజీలో ఉన్న విలేకరులపైనా దాడి చేస్తోంది సైన్యం. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులపై పోలీసులు టియర్గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో విరుచుకుపడ్డారు. మిలటరీ సైనికులు సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మరింత దిగజారింది. పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగిస్తుండగా.. సైనికులు ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే ఆటోమేటెడ్ గన్స్తో కాల్పులు జరిపారు.
ఒక్క యాంగాన్లోనే 18 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మాండలే, మోన్యవా నగరాల్లో జరిపిన కాల్పుల్లో ఏడుగురు ఆందోళనకారులు చనిపోయారు. ఆందోళనలతో సంబంధం లేని వారిపైనా పోలీసులు విరుచుకుపడ్డారు. యాంగాన్లో క్షతగాత్రులకు సాయం చేసేందుకు వచ్చిన ముగ్గురు అంబులెన్స్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు సైనికులు. ఆందోళనలను కవర్ చేస్తున్న ముగ్గురు జర్నలిస్టులను అరెస్టు చేశారు. అటు.. 13 మంది మయన్మార్ పోలీసులు.. ఆశ్రయం కల్పించాలంటూ భారత ప్రభుత్వాన్ని శరణు కోరారు.
మయన్మార్ మారణకాండను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఈ మారణకాండను రక్తపాత దినంగా ఐక్యరాజ్య సమితి మయన్మార్ అధికార ప్రతినిధి క్రిస్టిన్ స్కారనర్ అభివర్ణించారు. మయన్మార్పై ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది.