Nepal PM : నేపాల్ కొత్త ప్రధానిగా షేర్ బహదూర్..ఓలీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్
నేపాల్ లో మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని కేపీ శర్మ ఓలీకి ఆ దేశ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Nepal PM నేపాల్ లో మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని కేపీ శర్మ ఓలీకి ఆ దేశ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐదు నెలల వ్యవధిలో రెండోసారి రద్దయిన నేపాల్ ప్రతినిధుల సభను సోమవారం ఆ దేశ సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. అంతేకాకుండా రెండు రోజుల్లోగా నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షేర్ బహదూర్ దేవుబాను ప్రధానిగా నియమించాలని కోర్టు ఆదేశించింది.
కాగా, ప్రధాని కేపీ శర్మ ఓలి సిఫార్సు మేరకు మే 22న నేపాల్ ప్రెసిడెంట్ బిద్యా దేవి భండారి దిగువ సభను రద్దు చేశారు. ఐదు నెలల వ్యవధిలో దిగువ సభను రద్దు చేయడం ఇది రెండోసారి. కేపీ శర్మ సిఫార్సు మేరకు నవంబర్ 12, 19 తేదీల్లో ఎన్నికలను కూడా ప్రెసిడెంట్ ప్రకటించారు. మధ్యంతర ఎన్నికల కోసం గత వారమే ఎన్నికల సంఘం షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. అయితే దిగువ సభను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్తోపాటు మొత్తం 30 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ చోలేంద్ర షంషేర్ రాణా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం జులై-5 వాదనలు వినడం పూర్తి చేసింది. ఇవాళ తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు దిగువ సభను పునరుద్ధరించడమే కాకుండా ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ చీఫ్ను ప్రధానిని చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.