అక్టోబర్- 1 నాటికి అమెరికాలో 1 లక్షా 80 వేల కరోనా మరణాలు
అక్టోబర్- 1,2020 నాటికి అమెరికాలో 1 లక్షా 80 వేల కరోనా మరణాలు నమోదవుతాయని నిపుణులు అంచనా వేశారు. అయితే యూఎస్ఏ లో యూనివర్సల్ మాస్క్ వేర్ ఆర్డర్…దాదాపు 33వేల మంది ప్రాణాలు కాపాడవచ్చని అంచనా వేశారు. ఒకవేళ 95 శాతం మంది అమెరికన్లు మాస్క్లు ధరిస్తే, అప్పుడు మరణాల సంఖ్య లక్షా 46 వేల వరకు ఉండే అవకాశం ఉంటుందన్నారు.
అమెరికా వ్యాప్తంగా 159,497 నుండి 213,715 మరణాలు నమోదవుతాయని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ బుధవారం ఒక మోడల్ ను విడుదల చేసింది. ప్రజలు మాస్క్ ధరించడం… కరోనా మహమ్మారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ క్రిస్ ముర్రే అన్నారు. మాస్క్ ధరించడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు వ్యక్తికి 1/3 – సగం కంటే ఎక్కువ – వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గిస్తుంది అని తెలిపారు. కానీ కమ్యూనిటీ లెవెల్ లో అసాధారణమైన స్థాయిలో ప్రజల ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. అమెరికాలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 36,000కు పైగా కొత్త కరోనా కేసులు బయటపడిన సమయంలో ఈ అంచనాలు బయటికొచ్చాయి.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్… వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి ముఖాన్ని కవర్ చేసేలా సాధారణ క్లాత్స్ వాడండి అని ఏప్రిల్ లో సలహా ఇవ్వగా, ఇటీవలి వారాల్లో రాష్ట్రాలు తమ విధానాలను సడలించడం ప్రారంభించాయి. మాస్క్ ధరించే విషయం ఇప్పుడు అక్కడ రాజకీయా వివాదంగా మారింది. అరిజోనా రాష్ట్ర గవర్నర్ డౌ డ్యూసీ గత వారం లోకల్ కమ్యూనిటీలకు మాస్క్ లు అవసరమయ్యే అథారిటీని ఇచ్చినప్పటికీ గత వారం అరిజోనాలో మాస్క్ వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. COVID-19 యొక్క వ్యాప్తిని తగ్గించడానికి పబ్లిక్ ప్లేసులలో మాస్క్ లు ధరించడం అవసరమని వాషింగ్టన్ గవర్నర్ జే ఇన్స్ లీ మంగళవారం ప్రకటించారు. బుధవారం, నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్ పబ్లిక్ లో మాస్క్ లు అవసరమయ్యే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.
మరోవైపు,అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు క్వారెంటైన్ నియమావళిని పాటిస్తున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనక్టికట్ రాష్ట్రాలు.. స్వీయ నిర్బంధన ఉత్తర్వులు జారీ చేశాయి. ఎనిమిది రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఈ నిషేధం వర్తిస్తుంది. ఈ మూడు రాష్ట్రాలకు వచ్చే వాళ్లు 14 రోజుల పాటు క్వారెంటైన్లో ఉండాలని ఆదేశించాయి. కోవిడ్19 కేసులు అధికం అవుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటివరకు అగ్రరాజ్యంలో 2,359,600 కరోనా కేసులు నమోదు కాగా 121,239మంది మహమ్మారి బారిన పడి మరణించారు.
హాట్ స్పాట్లుగా ఉన్న న్యూయార్క్, న్యూజెర్సీలలో కరోనాకేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. అయితే దక్షిణ అమెరికా, పశ్చిమ అమెరికా ప్రాంతాలే ఈ వైరస్ దాటికి విలవిలలాడుతున్నాయి. అరిజోనా, కాలిఫోర్నియా, మిస్సిసిపి, నెవడా, టెక్సాస్లో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి.